కరోనా కల్లోలం: ఒక్కరోజులో దాదాపు 25వేల కొత్త కేసులు, మెరుగైన రికవరీ రేటు, ఢిల్లీ బెటర్
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 24,879 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో తొలిసారిగా ఒక్కరోజే దాదాపు 25వేల మార్కు దగ్గరకు చేరింది.
8 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. రికవరీ రేటు
తాజా కేసులతో గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 7,67,296కు పెరిగిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. కాగా, బుధవారం ఒక్కరోజే 487 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 21,129కు చేరింది. కరోనా సోకిన మొత్తం మంది బాధితుల్లో ఇప్పటి వరకు 4,76,378 మంది కోలుకోగా, 2,69,789 యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న వారి శాతం 61.5కు పెరిగింది.
మహారాష్ట్రలో అత్యధికంగా..
ఇక మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్రలో 6603 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 2,23,724కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 9448 మంది మరణించారు.
తమిళనాడులో భారీగా కేసులు.. ఢిల్లీ బెటర్...
తమిళనాడులో బుదవారం ఒక్కరోజే 3756 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,22,350కి చేరింది. ఇప్పటి వరకు 1700 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా విజృంభిస్తూనే ఉంది. కొత్తగా 2033 కేసులతో మొత్తం బాధితుల సంఖ్య 1,04,864కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3213 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఢిల్లీలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అధికంగా ఉండటం శుభసూచకమే. ఇక్కడ రికవరి రేటు దాదాపు 70శాతంగా ఉండటం గమనార్హం. మెరుగైన వైద్య సేవల కారణంగానే రికవరీ రేటు పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు.