రైతుల నిరసన: మహిళా దినోత్సవం రోజున ఢిల్లీ వైపు 40వేల మంది మహిళలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పంజాబ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 40వేల మంది మహిళలు ఢిల్లీ దిశగా సాగుతూ నిరసన తెలుపుతాయని రైతు సంఘాల నేతలు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచే పలువురు మహిళలు తమ నిరసనలను ప్రారంభించారని చెప్పారు.
పంజాబ్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ట్రాక్టర్లతో ర్యాలీలు నిర్వహించనున్నట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. కాగా, బర్నాలాలో అనేక మంది మహిళలు ట్రాక్టర్లు నడుపుతూ నిరసన వ్యక్తం చేయడం గమనార్హం. పురుష రైతులు కూడా ర్యాలీలు నిర్వహించారు.
అనేక మంది మహిళలు తమ పిల్లలను పరీక్షలకు సిద్ధం చేసే పనిలో ఉన్నారని బీకేయూ(దకౌండా) పంజాబ్ స్టేట్ కమిటీ సభ్యురాలు మహిళా నేత బల్బీర్ కౌర్ తెలిపారు. అయినా, మరికొందరు మహిళలు ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్నారని చెప్పారు. మన్సా నుంచి చాలా మంది బయల్దేరింది.
కాగా, బీకేయూ(యుగ్రహన్) అన్ని రైతు సంఘాల్లో అతిపెద్ద మహిళా శాఖ. ఆదివారం ఉదయం 500 బస్సులు, 600 మినీ బస్సులు, 115 ట్రక్కులు, 200 చిన్న వాహనాల్లో చాలా మంది మహిళలు బయల్దేరారని బీకేయూ(యుగ్రహన్) ప్రధాన కార్యదర్శి సుఖ్ దేవ్ సింగ్ కోక్రికలాన్ వెల్లడించారు. ఆదివారం రాత్రి వరకు టిక్రి సరిహద్దు వరకు చేరుకుని మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారని చెప్పారు. ఇక్కడ అనేక కార్యక్రమాలు మహిళల ఆధ్వర్యంలోనే జరుగుతాయని తెలిపారు.