Women's Day: రైతుల ఆందోళనలకు మహిళల సారథ్యం: ఢిల్లీ వైపు వేలమంది
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా సుదీర్ఘకాలం పాటు ఆందోళనలు, దీక్షలను నిర్వహిస్తోన్న రైతులకు ఇక మహిళలు అండగా నిలువబోతోన్నారు. ఈ నిరసన ప్రదర్శనలకు నేతృత్వాన్ని వహించబోతోన్నారు. దీనికోసం వేలాది మంది రైతులు దేశ రాజధాని వైపు కదిలారు. కాస్సేపట్లో వారు రైతు ఉద్యమంలో పాల్గొనబోతోన్నారు. వారిని అడ్డగించడానికి పోలీసులు ఎక్కడికక్కడ బ్యారికేడ్లను అమర్చారు. ఢిల్లీ వైపు రాకుండా అడ్డుకుంటున్నారు.
Recommended Video
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు ఈ నిర్ణయాన్ని తీసుకన్నారు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన 40 వేలమందికి పైగా మహిళలు.. రైతు దీక్షలో పాల్గొననున్నారు. వారికి సంఘీభావాన్ని తెలుపనున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ నుంచి వారంతా ఢిల్లీ సరిహద్దుల వైపు ట్రాక్టర్లు, బస్సులు, ఇతర వాహనాలపై బయలుదేరారు. కొద్దిసేపట్లో వారంతా సింగు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దులకు చేరుకోనున్నారు.
ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్. ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీ సరిహద్దులకు చేరుకునే మహిళల కోసం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశామని భారతీయ కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సుఖ్దేవ్ సింగ్ కోక్రికలాన్ వెల్లడించారు. 500 ట్రాక్టర్లు, 600 మినీ బస్సులు, 115 ట్రక్కులు, 200లకు పైగా ట్రాక్టర్లు, ఇతర వాహనాల ద్వారా వారంతా ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారని పేర్కొన్నారు. సుదీర్ఘకాలం పాటు కొనసాగుతోన్న తమ ఉద్యమంలో మహిళా రైతుల పాత్ర కీలకంగా ఉంటోందని చెప్పారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. వారే ఈ ఉద్యమాన్ని నడిపిస్తారని అన్నారు. మహిళ సత్తా చాటేలా ఈ ప్రదర్శన ఉంటుందని స్వరాజ్ ఇండియా అధ్యక్షుడు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. సింగు, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దుల్లో సాగే నిరసన ప్రదర్శనలకు మహిళలే సారథ్యాన్ని వహిస్తారని చెప్పారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం అందుతోందని అన్నారు. దీన్ని పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.