2019 ఎన్నికల్లో గెలిచిన దాదాపు 50% మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయట!
ఏడు విడతలుగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో కలిపి 8049 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు . అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులపై ఆసక్తికర సర్వేలు జరిగాయి . నిన్నటికి నిన్న ఇండియా టుడే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులలో విద్యా వంతులు ఎవరు అన్నదానిపై సర్వే నిర్వహిస్తే తాజాగా నేషనల్ ఎలక్షన్ వాచ్ , అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థలు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులలో అత్యంత సంపన్నులు ఎవరు అన్నదానిపై సర్వే నిర్వహించింది. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా లోక్ సభ అభ్యర్తులుగా గెలిచిన వారిలో ఎంత మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్న దానిపై ఆసక్తికర సర్వే జరిగింది. ఇప్పుడు దీనిపై జోరుగానే చర్చ జరుగుతుంది.
లోక్ సభ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో దాదాపు 50 శాతం మందిపై క్రిమినల్ కేసులు
ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉన్న వారి అఫిడవిట్లను ఆధారంగా చేసుకొని నిర్వహించిన సర్వేలో దేశంలోని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో దాదాపు 50 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తించారు . ఈసీకి సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం, 17 వ లోక్సభలో 50 శాతం ఎంపీలపై నేరారోపణలున్నాయి. 539 కొత్తగా ఎన్నికైన ప్రతినిధులలో 233 మంది లోక్సభ సభ్యులు వివిధ క్రిమినల్ కేసులను కలిగి ఉన్నారు, 2009 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఇది 44% ఎక్కువ. కేరళలోని ఎడుక్కి చెందిన కాంగ్రెస్ ఎంపి డీన్ కురియాకోస్కు కు వ్యతిరేకంగా అత్యధికంగా 204 కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
గతంతో పోలిస్తే చాలా ఎక్కువగా నేర చరిత్ర ఉన్న లోక్ సభ సభ్యులు
ఈసీకి సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం 2014 ఎన్నికల్లో, 185 మంది ఎంపీలపై , 2009 లో 162 మంది ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలియజేశారు. ఇక కొత్తగా ఎన్నికైన వారిలో 159 మంది ఎంపీలు (29%) రేప్, హత్య కేసు వంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. , కిడ్నాపింగ్ మరియు మహిళల వేధింపు వంటి నేరాలు చేసిన వారు సైతం ఉన్నారు. 112 మంది లోక్సభ ఎంపీలు 2014 లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు పేర్కొనగా,2009 లో 76 మంది ఎంపిలు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నట్టు అఫిడవిట్ లలో పేర్కొన్నారు.
2009 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఇది 44% పెరిగిన క్రిమినల్ కేసులున్న ఎంపీలు
ఇక పార్టీల వారీగా చూస్తే అత్యధికంగా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన 303 మంది విజేతల్లో 116 మంది పార్లమెంటు సభ్యులు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. ఇక 29 మంది కాంగ్రెస్ ఎంపీలు, 10 మంది డిఎంకె ఎంపీలు కూడా తమ నేరారోపణలను సమర్పించారు.మొత్తానికి ఈసారి 2009 తో పోల్చి చూస్తే లోక్ సభ అభ్యర్థులలో క్రిమినల్ కేసులు ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.