మోడీ పని భేష్, కొంత సమయమివ్వాలి: చందాకొచ్చర్
ముంబై: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ఫలితాలు కనిపించాలంటే మరికొంత సమయం పడుతుందని, అందుకు ఓర్పుతో వేచి చూడాలని ఐసీఐసీఐ బ్యాంక్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచ్చర్ అన్నారు.
భారత్వంటి భిన్నమైన దేశాల్లో ప్రభుత్వ నిర్ణయాలు వెంటనే వాస్తవ రూపం దాల్చలేవని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే ప్రయాణిస్తోందన్నారు. ప్రభుత్వ విధానాల ప్రభావాలు ఇప్పటికే కొంత మేరకు కనిపిస్తున్నాయన్నారు.
ప్రభుత్వం ఎన్నో సమస్యలను పరిష్కరిస్తోందని చెప్పారు. ఇక నుంచి ఆర్థిక వ్యవస్థ మరింత సానుకూలంగా ఉంటుందన్నారు. మంగళవారం జరిగిన కెనడా - భారత్ బిజినెస్ ఫోరమ్లో ఆమె ప్రసంగించారు.
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీయే విధానాలు గత యూపీఏలాగే ఉన్నాయంటూ సోమవారం కేంద్ర మాజీ మంత్రి, బిజెపి నేత అరుణ్ శౌరీ అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చందా కొచ్చర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.