ఎంజిఆర్ అభిమానులే కార్యకర్తలుగా అన్నాడిఎంకె, రజనీకాంత్ చక్రం తిప్పేనా?
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో సినీ నటులు కీలకపాత్ర పోషించారు. ఎంజిఆర్, జయలలిత తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. విజయ్కాంత్ లాంటి హీరోలు ఏర్పాటు చేసిన పార్టీ తమిళనాడు రాష్ట్రంలో ఒకానొక దశలో ప్రత్యామ్నాయశక్తిగా కన్పించింది. సినీ నటుడు రజనీకాంత్ కూడ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అయితే తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితులు రజనీకాంత్కు అనుకూలిస్తాయా లేదా అనేది ఆచరణలో తేలనుంది. అయితే రజనీకాంత్ పార్టీ అనుసరించే విధానాలు, ఆ పార్టీపై ప్రకటించే పథకాలు కూడ ఈ విషయై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత అన్నాడిఎంకెలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. అన్నాడిఎంకె నుండి శశికళను దినకరన్ను బయటకు పంపారు. ఆర్ కె నగర్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాక అన్నాడిఎంకెలో పరిస్థితులు మారేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాష్ట్రంలో రాజకీయ అస్థిరత కొనసాగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే రజనీకాంత్ రాజకీయ పార్టీ ఏర్పాటుపై చాలా కాలంగా కొనసాగుతున్న ఊహగానాలకు ఆదివారం నాడు తెరదించారు.
అభిమానులే పార్టీ కార్యకర్తలుగా ఎంజిఆర్ ప్లాన్
డిఎంకె చీఫ్ కరుణానిధి, సినీ నటుడు మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజిఆర్ ఒకప్పుడు మంచి స్నేహితులు. అయితే కరుణానిధితో విభేదించి ఎంజిఆర్ 1972 అక్టోబర్ 17న, అన్నాడిఎంకెను ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఎంజిఆర్ తనను అభిమానులనే పార్టీ కార్యకర్తలుగా మలిచారు. పార్టీ ఏర్పాటు చేసిన రెండు మాసాలకే దిండిగల్ లోక్సభ స్థానం నుండి ఎంజిఆర్ ఎంపిగా విజయం సాధించారు. ఆ తర్వాత ఏడాదికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు అసెంబ్లీ సీటు నుండి ఎంజిఆర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.అయితే ఈ విజయాల వెనుక అభిమానులు కీలకంగా పనిచేశారు. అంతేకాదు ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీతో అన్నాడిఎంకె సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. డిఎంకెకు వ్యతిరేకంగా అన్నాడిఎంకె అనతికాలంలోనే రాష్ట్రంలో విస్తరించింది. దీని వెనుక ఎంజిఆర్ అభిమానులు కీలక పాత్ర పోషించారు.
ఎంజిఆర్ ముఖ్యమంత్రిగా
1977 జూన్ 30వ, తేదిన ఎంజిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే 1980, 1984 ఎన్నికల్లో కూడ అన్నాడిఎంకె విజయం సాధించింది.1987లో ఎంజిఆర్ మరణించేవరకు కూడ ఆయన సీఎంగా కొనసాగారు.ఎంజిఆర్ మరణించిన తర్వాత అన్నాడిఎంకెలో సంక్షోభాలు చోట చేసుకొన్నాయి. ఎంజిఆర్ బతికున్న కాలంలోనే జయలలిత పార్టీలో ప్రచార కార్యదర్శి పదవిలో ఉన్నారు. ఎంజిఆర్ ఆమెను రాజ్యసభకు పంపారు. అయితే ఎంజిఆర్ మరణించిన తర్వాత జానకీ రామచంద్రన్ నెలరోజుల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. కానీ, ఆ ప్రభుత్వం రద్దైంది. పార్టీని నడపడం కూడ జానకీ రామచంద్రన్ చేతకాలేదు. ఆ సమయంలో జయలలిత పార్టీని సమర్థవంతంగా నడిపారు. జానకీ రామచంద్రన్ వైపు ఉన్న నేతలు, ఎమ్మెల్యేలు కూడ జయలలిత వైపుకు వచ్చారు.
జయలలిత సీఎం
జానకీ రామచంద్రన్ ఎక్కువ కాలం పార్టీని కూడ నడపలేకపోయారు. అయితే జానకీ రామచంద్రన్ కంటే జయలలితకు 1991లో ఎక్కువ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. దీంతో జానకీ రామచంద్రన్ వైపు ఉన్న ఎమ్మెల్యేలు కూడ జయ వైపుకు వచ్చారు. ఆ తర్వాత జయ వెనుతిరిగి చూడలేదు. రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అన్నాడిఎంకెను అధికారంలోకి తీసుకొచ్చింది జయలలిత. తొలిసారిగా జయలలిత ముఖ్యమంత్రి భాత్యతలను చేపట్టింది. ఆ తర్వాత కేసుల కారణంగా 2001లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేకపోయింది. కేసు తీర్పు వచ్చాక ఆమె సీఎంగా బాధ్యతలను చేపట్టారు.
రజనీకాంత్ అభిమానులు
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించారు. వరుసగా ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించిన రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. అయితే రాజకీయాల్లో రజనీకాంత్ అభిమానులే క్రియాశీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. నాడు ఎంజిఆర్ కూడ అభిమానులే అన్నాడిఎంకె పార్టీ బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఈనాడు రజనీకాంత్ అభిమానులు కూడ అదే పాత్రను పోషించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్ర పరిస్థితులు
తమిళనాడు రాష్ట్రంలో రెండు ద్రవిడ పార్టీల మధ్య అధికార మార్పిడి చాలా కాలంగా కొనసాగుతోంది. అయితే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. అయితే అదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వాతావరణం రజనీకాంత్కు కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రజనీకాంత్ ప్రకటించే విధి విధానాలు కూడ ఆ పార్టీ భవితవ్యంపై ఆధారపడి ఉంటాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.