వాతావరణ సమస్యలకు వేదాల సారమే పరిష్కారం: మోడీ
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల సమస్య పరిష్కారానికి వేదాల సారాన్ని ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచానికి పిలుపునిచ్చారు. ఆదివారం జరిగిన ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ (ఐఎస్ఏ) తొలి సదస్సులో ఆయన మాట్లాడారు.
ఈ సదస్సుకు అతిథులుగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ వ్యవహరించారు. దీనిలో 23 మంది దేశాధినేతలు, 10 మంది మినిస్టీరియల్ ప్రతినిథులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సూర్యుడు ఈ విశ్వానికి ఆత్మ అని వేదాలు ఘోషిస్తున్నాయని, జీవాన్ని పరిపుష్టం చేసే శక్తి సూర్యునికి ఉందని చెప్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వేధిస్తున్న వాతావరణ మార్పులతో పోరాడేందుకు తగిన మార్గాన్ని అన్వేషించడంలో భాగంగా ఈ ప్రాచీన దృక్పథాన్ని పరిశీలించవలసిన అవసరం చాలా ఉందని చెప్పారు.
భారతదేశం పునరుద్ధరణీయ వనరుల నుంచి 2022 నాటికి 175 గిగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని, దీనిలో 100 గిగావాట్లు సౌర శక్తి నుంచి వస్తుందని ప్రధాని తెలిపారు. మూడేళ్లలో 28 కోట్ల ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయడం వల్ల రూ.13 వేల కోట్లు, నాలుగు గిగావాట్ల విద్యుత్తు ఆదా అయినట్లు వివరించారు. సౌర శక్తి అభివృద్ధి మన సౌభాగ్యానికి దారి తీస్తుందని తెలిపారు.
ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ సెక్రటేరియట్ పటిష్టంగానూ, వృత్తిపరమైన సామర్థ్యంతోనూ పని చేసే విధంగా మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతేగాక, భూమిపై కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని వివరించారు. ఉత్తమమైన, భరించగలిగే ధరల్లో సౌర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలన్నారు. ఇతర రూపాల్లోని ఇంధనాన్ని సౌర శక్తితో అనుసంధానం చేస్తే ఫలితాలు మరింత బాగుంటాయని వివరించారు.