ఎన్ఐఏ కేసు: ఫోరెన్సిక్ ల్యాబ్కు యూరీ ఉగ్రవాదుల వేలిముద్రలు
న్యూఢిల్లీ: యూరీ ఉగ్రదాడిపై కేంద్ర మంత్రి వీకే సింగ్ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్ తీరును ఐక్యరాజ్య సమితిలో ఎండగడుతామని అన్నారు. పాక్కు తగిన గుణపాఠం చెబుతామని ఆయన స్పష్టం చేశారు. యూరీ ఉగ్రదాడికి స్థానికులు సహకరించి ఉంటారనే అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. యూరీ ఉగ్రదాడిలో హతమైన ఉగ్రవాదులు రక్త నమూనాలను, వేలిముద్రలను సేకరించాని అన్నారు. వాటిని అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నట్లు ఆయన తెలిపారు.
యూరీ అమరవీరులకు అశ్రునివాళి
యూరీ ఆర్మీ క్యాంప్పై ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు వారివారి స్వగ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించారు. భారీ సంఖ్యలో జనం అందులో పాల్గొన్నారు. అమరవీరులకు తగిన రీతిలో నివాళులర్పించారు. ఎక్కడ చూసినా విషాదఛాయలే కనిపిస్తున్నాయి. యూరీ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల స్వగ్రామాల్లో విషాదం అలముకుంది.
గయకు చెందిన నాయకేస్ విద్యార్థి ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడయ్యాడు. అతడికి గ్రామస్థులు అరుదైన నివాళి అర్పించారు. విద్యార్థి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించేందుకు వీలుగా పాడైన రోడ్లను చదును చేశారు. ఇక అతని మరణంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.
పశ్చిమబెంగాల్కు చెందిన జవాన్ గంగాధర్ దల్వీకి హౌరాలో అంత్యక్రియలు నిర్వహించారు. వందలాది మంది సైనికులు ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. గంగాధర్ అమర్రహే అంటూ నినాదాలు చేశారు. హవల్దార్ ఎస్ఎస్ రావత్ అంతిమయాత్ర అతని స్వస్థలం రాజస్థాన్లో జరిగింది. భారీగా జనం తరలివచ్చారు.
మహారాష్ట్రలోని సతారాలో లాల్స్నాయక్ జీ.శంకర్ అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. మంగళవాయిద్యాలతో శంకర్ మృతదేహాన్ని ఊరేగించారు. అతని సమాధిని పూలతో అలంకరించారు. ఉత్తర్ప్రదేశ్ సంత్కబీర్ నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన సిఫాయి గణేశ్ శంకర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులను కంటతడి పెట్టించింది.
యూరీ ఘటనపై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
జమ్ముకాశ్మీర్లోని యూరీ సైనిక శిబిరంపై ఉగ్ర దాడి ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) మంగళవారం కేసు నమోదు చేసింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఉగ్రదాడిలో 18 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు చేపడుతోంది.
ఈ ఘటనలో సైన్యం నలుగురు ఉగ్రవాదులను హతమార్చిన సంగతి తెలిసిందే. జైషే-మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన నలుగురు ఉగ్రవాదుల డీఎన్ఏ నమూనాలను ఎన్ఐఏ బృందం తీసుకోనుంది. వీరి ఫొటోలను భారత జైళ్లలో ఉన్న జైషే ఉగ్రవాదులకు చూపించి వివరాలు సేకరించే ప్రయత్నం చేయనుంది.
దర్యాప్తును జమ్ముకాశ్మీర్ పోలీసుల నుంచి ఎన్ఐఏ బృందం తీసుకుంది. ఎన్ఏఐ పలు ఆధారాలు సేకరిస్తోంది. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న జీపీఎస్లలో ఒకటి మంటల కారణంగా కాలిపోయిందని మరొక జీపీఎస్ను సాంకేతిక నిపుణుల సహాయంతో ఉగ్రవాదులు వచ్చిన దారిని కనుగొనేందుకు ప్రయత్నిస్తామని, స్థానికుల సహాయం కూడా తీసుకుంటామని చెప్పారు.