Lockdown 2.0: మెరుగైన రేపటి కోసం అంటూ వెంకయ్యనాయుడు పిలుపు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పలు కీలక సూచనలు చేశారు. భవిష్యత్ బాగుండాలంటే ప్రస్తుతం కొన్ని కష్టాలు భరించాల్సిందేనని అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పలు ట్వీట్లు చేశారు.
లాక్డౌన్ 2.0 ఆశించిన ఫలితాలు రావాలంటే..
కరోనాపై పోరాటం ఎంత కాలమనేది మన చేతుల్లోనే ఉంది. మెరుగైన భవిష్యత్ కోసం ప్రస్తుతం కొన్ని కష్టాలు, ఇబ్బందులు భరించాలి. లాక్డౌన్ 2.0 ఆశించిన ఫలితాలు రావాలంటే అది ప్రజల మీద ఆధారపడి ఉందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
ప్రధాని నిర్ణయం ఉత్తమమే..
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయమే ఉత్తమమైనదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా దుర్భలమైన వర్గాల జీవనోపాధి గురించి ప్రధాని జాగ్రత్తలు తీసుకుంటానని హామి ఇచ్చారని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. వారితోపాటు రైతులు, వ్యవసాయ కార్మికులకు కూడా అవసరమైన చర్యలను ప్రధాని తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ..
ప్రస్తుత పరీక్షా సమయంలో మనం చేసే పోరాటాన్ని బట్టి లాక్డౌన్ ఎత్తివేత ఆధారపడి ఉంటుందని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. లాక్డౌన్ 1.0లో సాధించిన ఫలితాన్ని కాపాడుకోవాలంటే ప్రస్తుత లాక్డౌన్ను అదే స్ఫూర్తితో కొనసాగించాలని ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. కాగా, కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోడీ మే 3 వరకు లాక్డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. పరిస్థితిలో కొంత అదుపులోకి వస్తే ఏప్రిల్ 20 నుంచి కొన్ని సడలింపులు కల్పిస్తామని చెప్పారు. ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.
భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
ఇక దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10వేల దాటడం గమనార్హం. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 1211 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 10,363కు చేరింది. మరో 31 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 339కి చేరింది. ఇప్పటి వరకు 1039 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 2,31,902 పరీక్షలు నిర్వహించారు.