5జీ నెట్వర్క్..యాప్ మార్కెట్: హ్యాండ్సెట్లను మార్చడం హాబీగా: తక్కువ మొబైల్ ఛార్జీలు: మోడీ
న్యూఢిల్లీ: దేశంలో మొబైల్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మొబైల్ నెట్వర్క్, డేటా వినియోగంలో భారత్ ముందంజలో ఉందని పేర్కొన్నారు. ఈ రంగంలో మరింత పురోభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని కల్పించడానికి తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో అన్ని గ్రామాలకు హై-స్పీడ్ ఫైబర్ ఆప్టిక్ డేటా కనెక్టివిటీని ఇస్తామని స్పష్టం చేశారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)ను కొద్దిసేపటి కిందట ప్రారంభించారు.
Recommended Video
అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలో 5జీ నెట్వర్క్ను సత్వరమే అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు. ఈ దిశగా సత్వర నిర్ణయాలను తీసుకోవాలని చెప్పారు. 5జీ స్పీడ్తో నెట్వర్క్ను కల్పించడం వల్ల డిజిటల్ మార్కెట్ మరింత వేగంగా పురోగమిస్తుందని అభిప్రాయపడ్డారు. డిజిటల్ మార్కెట్, డిజిటల్ కరెన్సీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ను ప్రోత్సహించడానికి తన ప్రభుత్వం అనేక చర్యలను తీసుకుందని ప్రధాని గుర్తు చేశారు.
ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి బీజం వేసినట్టవుతుందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో అన్ని గ్రామ పంచాయతీలకు హైస్పీడ్ డేటా కనెక్టివిటీని కల్పించడానికి ఇదివరకే చర్యలు చేపట్టామని, వాటిని మరింత వేగవంతం చేస్తామని నరేంద్ర మోడీ అన్నారు. ఎలక్ట్రానిక్ వేస్టేజీపై కొన్ని విప్లవాత్మక నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని మోడీ తెలిపారు. వృధాగా ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులను రీసైక్లింగ్ చేయడం ద్వారా ఆర్థిక రంగానికి ఏరకంగా బలోపేతం చేయవచ్చనే విషయం సూచనలు, సలహాలు ఇవ్వాలని మోడీ కోరారు.
ఎప్పటికప్పుడు కొత్త హ్యాండ్సెట్లను మార్చుతుండటం దేశ ప్రజల రోజువారీ జీవితంలో ఓ భాగంగా, సంప్రదాయంగా మారిందని మోడీ వ్యాఖ్యానించారు. మార్కెట్లో ఎలాంటి కొత్త రకం హ్యాండ్సెట్ వచ్చినా, వాటిని కొనుగోలు చేయడం అలవాటుగా పెట్టుకున్నారని, అందువల్లే- ఎలక్ట్రానిక్ వేస్టేజీ తీవ్రమైందని అన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్లోనే అతి తక్కువ మొబైల్ ఛార్జీలను వసూలు చేస్తోన్నాయని, ఫలితంగా గ్రామస్థాయిలో డేటా వినియోగం విస్తృతమైందని పేర్కొన్నారు. 5జీ నెట్వర్క్ అందుబాటులోకి తీసుకుని రావడం వల్ల..ఈ రంగం మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.