NEET 2020 : నేడే నీట్ పరీక్ష... వెంట అవి తప్పనిసరి... విద్యార్థులు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) ఆదివారం(సెప్టెంబర్ 13) జరగనుంది. ఈసారి పరీక్షకు 15.97 లక్షల మంది విద్యార్థులు హాజరవనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఫేస్ మాస్కులు ధరించడం,భౌతిక దూరం పాటించడం,పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేయడం తదితర జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించనున్నారు.
మొదట 2546 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ... ఆ తర్వాత ఆ సంఖ్యను 3843కి పెంచారు.అలాగే ఒక గదిలో 24 మంది విద్యార్థులకు సీటింగ్ ఇవ్వాలని భావించినప్పటికీ... ఆ తర్వాత దాన్ని 12కి కుదించారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటించేందుకు అనుగుణంగా ఈ ఏర్పాట్లు చేశారు. నిజానికి ఈ ఏడాది మే 3వ తేదీనే నీట్ పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. కరోనా కారణంగా రెండుసార్లు వాయిదా పడింది.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు.. పరీక్షా కేంద్రాల లోపలికి వచ్చే సమయంలో,బయటకు వెళ్లే సమయంలో ఒకచోట గుమిగూడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఉదయం 11.40 గంటల నుంచి 1.30 గంటల వరకు విద్యార్థులను అనుమతిస్తారు.విద్యార్థులు తప్పనిసరిగా అడ్మి ట్ కార్డు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్, ఫోటో (అప్లికేషన్లో పొందుపరిచినదే) తప్పనిసరిగా తీసుకురావాలి. అడ్మిట్ కార్డుపై తండ్రి/తల్లి సంతకం చేయించాలి.
50 ఎంఎల్ శానిటైజర్ బాటిల్, మాస్క్, గ్లోవ్స్, వాటర్ బాటిల్ను వెంట తెచ్చుకోవచ్చు. పరీక్షా కేంద్రంలో పెన్ అందిస్తారు. ఫుల్ హ్యాండ్స్ షర్టులు, బూట్లు ధరించకూడదు. విద్యార్థినులు చుడీదార్ మాత్రమే ధరించి రావాలి. సంప్రదాయ దుస్తులు.. అంటే బురఖా లాంటివి ధరించేవారు ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలి. వారిని నిబంధనల ప్రకారం తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, బ్యాగులు, ఇతరత్రా వ్యక్తిగత వస్తువులను అనుమతి లేదు. ముందుగా విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి... ఆ తర్వాతే లోపలికి అనుమతిస్తారు.
నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలైనప్పటికీ న్యాయస్థానం మాత్రం పరీక్షల నిర్వహణనే సమర్థించిన సంగతి తెలిసిందే. తీర్పును సమీక్షించాలని కోరుతూ బీజేపీయేతర ముఖ్యమంత్రులు రివ్యూ పిటిషన్ను దాఖలు చేసినప్పటికీ న్యాయస్థానం దాన్ని తోసిపుచ్చింది. దీంతో పరీక్షల నిర్వహణకు మార్గం సుగమం అయింది.