అగ్లీగా నీట్ పరిక్ష! బట్టలూడదీసి.. ఆభరణలు తొలగించి .. నానా రచ్చచేసి !
అమరావతి/హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష నిర్వహణకు కేంద్ర మాధ్యమిక విద్య మండలి (సీబీఎస్ఈ) ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 5న ఫలితాలు వెలువడతాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రెండు లక్షల మంది అభ్యర్థులు అధికంగా హాజరయ్యారు. ఈ ఏడాది 15 లక్షల 19 వేల మంది విద్యార్థులు పరీక్షలను రాశారు. దేశవ్యాప్తంగా 154 నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఫొని తుపాను నేపథ్యంలో ఒడిషాలో నీట్ పరీక్షను అధికారులు వాయిదా వేశారు.
విద్యార్థులా? దొంగలా?
నీట్ అనగానే.. పరీక్షా కేంద్రాల వద్ద కొన్ని ఆశ్చర్యకరమైన సన్నివేశాలు కనిపించడం సర్వ సాధరణమైపోయింది. గతంలో తాళి బొట్లను కూడా అక్కడి సిబ్బంది తొలగించిన సందర్భాలు ఉన్నాయి. ఈ సారి కూడా అదే పరిస్థితి నెలకొంది. చాలామంది అభ్యర్థులు పొడుగు చేతుల చొక్కాలు వేసుకుని రాగా.. అధికారులు వాటిని భుజాల వరకఉ కత్తిరించేశారు. ఈ విషయంలో ఆడవాళ్లని కూడా చూడలేదు సిబ్బంది. యువతులు కొందరు అరచేతుల వరకు కప్పేసిన పంజాబీ డ్రెస్సులను వేసుకుని రాగా.. వాటిని కూడా భుజాల వరకు తొలగించారు. విద్యార్థులను దొంగల్లా పరీక్షించారు. అణువణువూ తనిఖీ చేశారు. పిసరంతే ఉండే ముక్కుపుడకను కూడా బలవంతంగా తొలగించాల్సి రావడం పరాకాష్టగా చెప్పుకోవచ్చు.
ముక్కుపుడకకు మాత్రమే పరిమితం కాలేదు. మట్టెలు, గాజులు, గజ్జెలు..ఏవీ ఒంటిపై ఉండనివ్వలేదు. బూట్లు, ఎత్తు మడమల చెప్పులు, చేతి గడియారాలు, బంగారు, వెండి ఆభరణాలు, మంచినీళ్ల సీసా, పెన్ను, పెన్సిల్, స్కేలు, క్యాలిక్కులేటర్, ప్యాడ్, ఎరేజర్లను విద్యార్థులు తమ వెంట తీసుకెళ్లానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. నీట్ నిబంధనలతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి, అయోమయానికి గురయ్యారు. దీనికి తెరదించేలా ఏర్పాట్లు చేసే దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని విద్యార్థుల తల్లిదండ్రలు విమర్శిస్తున్నారు.