NEET, JEE 2020: విద్యార్థులు పరీక్షల నిర్వహణే కోరుకుంటున్నారు: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: జాతీయస్థాయిలో ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా వేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నవేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తాజాగా పరీక్షల నిర్వహణ విషయంపై స్పందించారు. పరీక్షలు నిర్వహించాలనే విద్యార్థులు కోరుకుంటున్నారని తెలిపారు.
జేఈఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 8.58 లక్షల మందిలో 7.5 లక్షల మంది, 15.97 లక్షల మంది నీటి అభ్యర్థుల్లో 10 లక్షల మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని కేంద్రమంత్రి తెలిపారు. విద్యార్థులు పరీక్షలు నిర్వహించాలని కోరుకుంటున్నారనడానికి ఇదే పెద్ద నిదర్శనమని అన్నారు. ఇప్పటికే మే-జూన్ మధ్య రెండుసార్లు ఈ పరీక్షలు వాయిదా పడ్డాయని, ఎక్కువ మంది తల్లిదండ్రులు పరీక్ష నిర్వహించేందుకు ఈ మెయిల్స్, ఇతర మాధ్యమాల ద్వారా మద్దతు తెలిపారని పోఖ్రియాల్ వివరించారు.
ఇక కరోనా వ్యాప్థి నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షల నిర్వహణపై ఆందోళన అవసరం లేదని కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ అన్నారు. అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని, విద్యార్థుల భద్రత, కెరీర్ తమకు ప్రధానమని చెప్పారు. ఈ పరీక్షల కోసం జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)పలు మార్గదర్శకాలు, నిర్దిష్ట విధానాలను జారీ చేసిందని చెప్పారు.
Recommended Video
ఎన్టీఏ అధికారులు, రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం పలు భేటీలు జరుగుతున్నాయని తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి కూడా రాష్ట్రాల విద్యాశాఖాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతుండగా.. ఈ అంశంపై నిరసనలు, రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. అన్ని వాదనలు విన్న మీదట సుప్రీంకోర్టు కూడా విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని మనం వృథా చేయరాదని గుర్తు చేసిందని కేంద్రమంత్రి తెలిపారు. కాగా, పలు రాజకీయ పార్టీలతోపాటు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్న విషయం తెలిసిందే.