నీట్, జేఈఈ ఇక ఏడాదికి రెండు సార్లు: కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈ(మెయిన్స్), నెట్ ప్రవేశ పరీక్షలను ఇక మీదట నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పరీక్షలను సీబీఎస్ఈ నిర్వహిస్తోంది.
శనివారం జవదేకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నీట్, జేఈఈ పరీక్షలను ఇకపై ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తామని చెప్పారు. ఈ పరీక్షలకు విద్యార్థులు రెండు సార్లూ లేదంటే ఏదైనా ఒకసారి హాజరుకావొచ్చని తెలిపారు. ఎక్కువ స్కోర్ వచ్చిన పరీక్షను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
జాతీయ అర్హత పరీక్ష(నెట్) డిసెంబరులో నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. జేఈఈ(మెయిన్స్) ప్రవేశ పరీక్షను ఏడాదిలో జనవరి, ఏప్రిల్లలో నిర్వహిస్తామని, నీట్ ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి, మే నెలల్లో పెడతామని తెలిపారు. ప్రతి పరీక్షను 4 లేదా 5 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.
ఈ పరీక్షలను ఆన్లైన్ నిర్వహిస్తామని, విద్యార్థులు ఇళ్లలో లేదా అధికారికంగా గుర్తించిన కంప్యూటర్ సెంటర్లలో ఉచితంగా ప్రాక్టీస్ చేసుకోవచ్చని స్పష్టం చేశారు. త్వరలోనే అధికారికంగా గుర్తించిన కంప్యూటర్ సెంటర్ల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. సిలబస్, ప్రశ్నల ఫార్మాట్, భాష, ఫీజుల్లో ఎలాంటి మార్పు ఉండదని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.