నీట్,జేఈఈ ఫిక్స్... సుబ్రహ్మణ్యస్వామి బిగ్ ట్విస్ట్... 'ఆత్మహత్యల'పై హెచ్చరిక...
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నీట్(National Eligibility cum Entrance Test NEET-UG),జేఈఈ(Joint Entrance Examination-Main) పరీక్షలను సెప్టెంబర్లోనే నిర్వహిస్తామని కేంద్ర విద్యా శాఖ శుక్రవారం(అగస్టు 20) వెల్లడించింది. నీట్ పరీక్షను సెప్టెంబర్ 13న,జేఈఈ పరీక్షను సెప్టెంబర్ 1-6 తేదీల్లో నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) స్పష్టం చేసింది. అయితే అంతకుముందే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని మోదీకి లేఖ రాసి ట్విస్ట్ ఇచ్చారు.పరీక్షలను వాయిదా వేయాలని ఆయన ప్రధానిని కోరారు.
అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్...
జేఈఈ మెయిన్స్(ఇంజనీరింగ్ ఎంట్రన్స్) కోసం దరఖాస్తు చేసుకున్న 8,58,273 మందిలో ఇప్పటికే 6.4లక్షల మంది అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. దాదాపు 99.07శాతం మంది విద్యార్థులకు... పరీక్షా కేంద్రం కోసం వారు ఎంచుకున్న నగరాల్లో మొదటి నగరానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చామని తెలిపింది. ఇప్పటివరకూ 142 మంది అభ్యర్థులు వేర్వేరు కారణాలతో తమకు కేటాయించిన నగరంలో కాకుండా మరో నగరంలో పరీక్షా కేంద్రానికి అభ్యర్థనలు పంపినట్లు పేర్కొంది.
వాయిదా వేస్తారన్న ఊహాగానాలు...
నిజానికి కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల డిమాండ్ మేరకు పరీక్షలు వాయిదా వేస్తారన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆ మరుసటిరోజే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షా తేదీలను ఖరారు చేయడం గమనార్హం. సాధారణంగా ప్రతీ ఏటా ఏప్రిల్లో జరిగే ఈ పరీక్షలు కరోనా కారణంగా ఈసారి సెప్టెంబర్కు వాయిదాపడ్డాయి. పరీక్షలను మరికొద్దిరోజులు వాయిదా వేయాలంటూ సుప్రీంలో దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఏర్పాట్లలో ఎన్టీఏ
పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్టీఏ వెల్లడించింది. పరీక్షల ముందు,పరీక్షల తర్వాత పరీక్షా కేంద్రాలను పూర్తిగా శానిటైజ్ చేస్తామని చెప్పింది.విద్యార్థులకు ఫ్రెష్ మాస్కులతో పాటు ఫ్రెష్ గ్లవ్స్ను కూడా అందజేస్తామని పేర్కొంది. శాంతిభద్రతలు,విద్యుత్ సప్లై,రవాణా సౌకర్యాలు,విద్యార్థులు గుంపులుగా చేరకుండా చూసుకోవడం... తదితర అంశాలపై ఇప్పటికే ఆయా రాష్ట్రాల సీఎస్లు, డీజీపీలు,డీఎం/ఎస్పీలకు లేఖలు రాసి వారి సహకారం కోరినట్లు తెలిపింది.
Recommended Video
సుబ్రహ్మణ్యస్వామి ట్విస్ట్...
ఓవైపు షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించేందుకు ఎన్టీఏ సన్నద్దమవుతుంటే... బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. పరీక్షలు వాయిదా వేసేలా చూడాలని ఆయన ప్రధాని మోదీని కోరారు. దీపావళి వరకు పరీక్షలను వాయిదా వేయాలని ప్రధానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. యువత భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షలు వాయిదా వేయాలని... లేనిపక్షంలో దేశంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాబట్టి తన అత్యవసర లేఖను పరిగణలోకి తీసుకుని పరీక్షలు వాయిదా వేసేలా విద్యాశాఖకు ఆదేశాలివ్వాలని కోరారు.