'నీట్,జేఈఈ' రివ్యూ పిటిషన్పై నేడు సుప్రీం విచారణ... వాయిదా పడే ఛాన్స్ ఉందా..?
నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణను సవాల్ చేస్తూ ఆరుగురు బీజేపీయేతర ముఖ్యమంత్రులు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్పై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. న్యాయమూర్తులు అశోక్ భూషణ్,బీఆర్ గవాయ్,కృష్ణమూర్తిల నేత్రుత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం మధ్యాహ్నం 1.30గంటలకు ఈ పిటిషన్ను విచారించనుంది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల జీవితాలను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు వాయిదా వేయాలని ఆ పిటిషన్లో ముఖ్యమంత్రులు పేర్కొన్నారు. అయితే నీట్,జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ గతంలో దాఖలైన పిటిషన్ను కొట్టిపారేసిన సుప్రీం కోర్టు... తాజా రివ్యూ పిటిషన్పై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
పిటిషన్లో ఏం పేర్కొన్నారు...
నీట్,జేఈఈ పరీక్షల నిర్వహణకు గతంలో సుప్రీం ఇచ్చిన అనుకూల తీర్పుపై తాజా పిటిషన్లో ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల జీవించే హక్కును కాలరాయడమేనని పేర్కొన్నారు.సుప్రీం కోర్టు కొన్ని లాజికల్ అంశాలను పరిగణలోకి తీసుకోలేదన్నారు. ట్రాన్స్పోర్ట్,హోటల్స్,రెస్టారెంట్స్ ఇతరత్రా అన్నీ మూసివున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులు వేరే చోటకు వెళ్లి పరీక్షలు ఎలా రాయగలరని అందులో ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ తరుపున మంత్రి మొలొయ్ ఘటక్,జార్ఖండ్ తరుపున మంత్రి రామేశ్వర్,రాజస్తాన్ తరుపున మంత్రి రఘు శర్మ,ఛత్తీస్గఢ్ తరుపున అమర్జీత్ భాగట్,పంజాబ్ తరుపున మంత్రి బీఎస్ సింధు,మహారాష్ట్ర తరుపున మంత్రి ఉదయ్ రవీంద్ర సావంత్ సుప్రీంలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
వాయిదాపడే ఛాన్స్ ఉందా..?
మరోవైపు ఇప్పటికే జేఈఈ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ పరీక్షల నిర్వహణ వాయిదాపై ఆశాభావం వ్యక్తం చేశారు. కనీసం నీట్ పరీక్షలైనా వాయిదా పడే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం పలు ఉదాహరణలు కూడా చెప్పారు. గతంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్,వలస కార్మికులు,యూజీసీ చివరి సంవత్సర పరీక్షల మార్గదర్శకాలు,ఇతరత్రా కేసుల్లో మొదట దాఖలైన పిటిషన్లను సుప్రీం కొట్టివేసిందని గుర్తుచేశారు. కానీ అవే కేసుల్లో ఆ తర్వాత దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించిందన్నారు.
గతంలో కొట్టివేసిన సుప్రీం...
సీనియర్ న్యాయవాదితో కలిసి నీట్ పరీక్షల వాయిదా కోసం తాను వాదించబోతున్నట్లు అలోక్ శ్రీవాస్తవ తెలిపారు. ఇతరులు కూడా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు విచారణ సంగతి ఎలా ఉన్నప్పటికీ... విద్యార్థులు మాత్రం ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా తమ స్టడీస్ పైనే ఫోకస్ చేయాలని చెప్పారు. అంతకుముందు అగస్టు 17న నీట్,జేఈఈ వాయిదాపై సుప్రీంలో విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసిన సంగతి తెలిసిందే. విద్యార్థులకు కీలకమైన ఒక సంవత్సరం వృథా కావద్దని అభిప్రాయపడ్డ సుప్రీం... కేంద్రం నిర్ణయాన్నే సమర్థించింది.
మొదటి 3 రోజులు ఎంతమంది హాజరయ్యారు...
దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 6 వరకు జరగనున్నాయి. అయితే మొదటి 3 రోజుల్లో దాదాపు 25శాతం మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు డేటా చెబుతోంది. ఈ 3 రోజుల్లో మొత్తం 458521 మంది విద్యార్థులు జేఈఈ పరీక్షలకు హాజరవాల్సి ఉండగా... 114,653 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు తేలింది. ఇప్పటివరకూ మొత్తం 3,43,958 మంది పరీక్షలు రాయగా... మొదటిరోజు 54.67శాతం,రెండో రోజు 81శాతం,మూడో రోజు 82శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
Recommended Video
రాద్దాంతం తగదంటున్న కేంద్రం..
నీట్,జేఈఈ విషయంలో ప్రతిపక్షాల రాద్దాంతం,రాజకీయం తగదని కేంద్రం ఇదివరకే పేర్కొంది. విద్యార్థులకు భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో రాజకీయం తగదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కాగా,సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ,సెప్టెంబర్ 13న నీట్ పరీక్షలు జరగునన్న సంగతి తెలిసిందే. జేఈఈ కోసం 9.53లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. నీట్ కోసం 15.97లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.