పరీక్షల షెడ్యూల్ సమీపిస్తోన్న వేళ: నీట్, జేఈఈ తీర్పుపై సుప్రీంలో రివ్యూ పిటీషన్: 6 రాష్ట్రాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వచ్చేనెల నిర్వహించబోయే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్), జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) పరీక్షల వాయిదా కోసం ఆరు రాష్ట్రాలు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులు, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆ పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఙప్తి చేశాయి. పరీక్షల నిర్వహణపై ఇదివరకు ఇచ్చిన ఆదేశాలను పునఃసమీక్షించాలని కోరాయి. ఈ మేరకు రివ్యూ పిటీషన్ను దాఖలు చేశాయి.
జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించడానికి ఒకవంక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సన్నాహాలను పూర్తి చేస్తోంది. వచ్చేనెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది ఎన్టీఏ. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం సరికాదని, దీన్ని వాయిదా వేయాలంటూ పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ను దాఖలు చేశాయి. నిజానికి- పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఈ నెల 17వ తేదీన తీర్పు వెలువడించిన విషయం తెలిసిందే.
యధాతథంగా జేఈఈ, నీట్ పరీక్షలను దేశవ్యాప్తంగా నిర్వహించడానికి ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశాలను ఇచ్చింది. పరీక్షలను వాయిదా వేయాల్సిన పరిస్థితే వస్తే.. దేశం చాలా నష్టపోతుందని న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా స్పష్టం చేశారు. ఈ తీర్పును పునఃసమీక్షించాలంటూ ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు రివ్యూ పిటీషన్ను వేశాయి. పరీక్షల షెడ్యూల్ సమీపిస్తున్న కొద్దీ నీట్, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. కాంగ్రెస్, దాని అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ, కొన్ని ప్రాంతీయ పార్టీలు వాయిదా కోసం డిమాండ్ చేస్తున్నాయి.
Recommended Video
పరీక్షలను వాయిదా వేయించడానికి కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా రంగంలోకి దిగారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సమయంలోనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ను దాఖలు చేయలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా కొద్దిసేపటి కిందట సుప్రీంకోర్టును ఆశ్రయించాయి ఆయా రాష్ట్రాలు. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూడా జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహించడానికి వ్యతిరేకమే. అయినప్పటికీ.. అవి సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాష్ట్రాల జాబితాలో లేవు.