కరోనా ఎఫెక్ట్ : వాయిదా పడ్డ నీట్.. తదుపరి అప్డేట్ ఎప్పుడంటే..?
వచ్చే మే 3వ తేదీన జరగాల్సి ఉన్న నేషనల్ ఎలిజిబిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్(NEET UG) మే చివరి వారానికి వాయిదా పడింది. దీంతో శుక్రవారం జారీ చేయాల్సిన అడ్మిట్ కార్డులను కూడా నిలిపివేశారు. ఏప్రిల్ 15 తర్వాత ఉండే పరిస్థితులను అంచనా వేసి అడ్మిట్ కార్డులు జారీకి తేదీని నిర్ణయించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వెల్లడించింది. అలాగే మే చివరి వారంలో నీట్ నిర్వహిస్తామని నోటీస్లో వెల్లడించినప్పటికీ.. ఏప్రిల్ 15 తర్వాతనే దానిపై తుది నిర్ణయం ఉంటుందన్నారు. శుక్రవారం ఆరోగ్య,మానవ వనరుల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారుల సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
Since Parents and Students have to travel to different examination centres, to avoid any inconvenience to them, I have directed National Testing Agency @DG_NTA to postpone NEET (UG) 2020 and JEE(Main) till last week of May. pic.twitter.com/loji50ZQq3
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) March 27, 2020
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు,వారి తల్లిదండ్రుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని నీట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి తెలిపారు. నీట్పై అప్డేట్స్ కోసం విద్యార్థులు ఎప్పటికప్పుడు అధికారి వెబ్ సైట్ను పరిశీలిస్తుండాలని చెప్పారు. పరీక్షా తేదీని విద్యార్థుల మొబైల్ నంబర్స్,ఈమెయిల్స్కు పంపిస్తామని తెలిపారు.
లాక్ డౌన్ ప్రకటన తర్వాత జేఈఈ పరీక్ష తేదీని ఏప్రిల్ మొదటి లేదా రెండో వారానికి వాయిదా వేశారు. పరీక్ష తేదీలపై తదుపరి ప్రకటన లాక్ డౌన్ పీరియడ్ ముగిసిన తర్వాతే ఉంటుందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన సీబీఎస్ఈ పరీక్షల తేదీపై ఒక స్పష్టత వచ్చిన తర్వాతే జేఈఈ పరీక్ష తేదీని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.