కాలేజ్ అమ్మాయి ప్రాణం తీసిన హేర్ స్టైల్, వెంట్రుకలు రాలిపోయాయి, నదిలో దూకి !
మైసూరు: హేర్ స్టైల్ చేయించుకుని అందంగా కనపడాలి అని భావించిన కాలేజ్ అమ్మాయి చివరికి తల వెంట్రుకలు రాలిపోతున్నాయని ఆవేదనతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని మైసూరు నగరం సమీపంలో జరిగింది.
కొడుగు జిల్లాలోని వీరాజ్ పేట్ సమీపంలోని నిట్టూరు గ్రామంలో నివాసం ఉంటున్న ప్రభాకర్, శైలా దంపతులకు జి. నేహా గంగమ్మ అలియాస్ నేహా (19) అనే కుమార్తె ఉంది. నేహా మైసూరు చేరుకుని జోసెఫ్ కాలేజ్ లో బీబీఏ విద్యాభ్యాం చేస్తున్నది. మైసూరు నగరంలోని గోకులంలో ఉన్న కూర్గ్ పీజీలో నేహా నివాసం ఉంటూ కాలేజ్ కు వెలుతోంది.
ఇటీవల మైసూరులోని రోహిణి బ్యూటీ జోన్ లో నేహా హేర్ స్టైల్ లో మార్పులు చేయించుకుంది. కర్లింగ్ హేర్ ఉన్న నేహా వాటిని నిటారుగా రావడానికి హేర్ స్టైల్ లో పలు మార్పులు చేయించుకుంది. హేర్ స్టైల్ లో మార్పులు చేయించుకున్న తరువాత నేహా తల వెంట్రుకులు రాలిపోవడం మొదలైనాయి.
తల వెంట్రుకలు రాలిపోతున్నాయని ఆందోళనతో నేహా కాలేజ్ కు వెళ్లకుండా పీజీకి పరిమితం అయ్యింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నిపుణులు దగ్గర చికిత్స చేయిస్తామని, తల వెంట్రుకలు రాలిపోకుండా వైద్యం చేయిస్తామని నేహాకు ధైర్యం చెప్పి కాలేజ్ కు పంపించారు.
కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పినా నేహా మాత్రం అదే ఆందోళన ఉండేది. ఆగస్టు 28వ తేదీన నేహా పీజీ నుంచి బయటకు వెళ్లింది. తరువాత ఆమె ఆచూకిలేదని పీజీ యాజమాన్యం మైసూరు నగరంలోని జయలక్ష్మిపురం పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
పీజీ నుంచి బయటకు వెళ్లిన నేహా లక్ష్మణతీర్థ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. నదిలో యువతి మృతదేహాం తేలుతున్న విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాం పరిశీలించి ఆత్మహత్య చేసుకుంది నేహా అని నిర్దారించారు. జయలక్ష్మిపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.