రాజకీయాలు ఏమైనా, పౌరుడిగా ఏం చేయాలనే ఆలోచన: దేవేగౌడ
బెంగళూరు: ప్రజాస్వామ్యానికి దివంగత జవహర్ లాల్ నెహ్రూ గట్టి పునాది వేశారని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. బెంగళూరులో 'ది ఇండియన్ పార్లమెంటు ఎ డెమోక్రసీ ఎట్ వర్క్ ఓఐపీ' పుస్తకాన్ని కన్నడలోకి తర్జుమా చేశారు. ఈ పుస్తక ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.
హిందీ కారణంగా ఆ భాష మాట్లాడే ఉత్తరాది రాష్ట్రాలలో రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. స్వాతంత్య్ర అనంతరం దేశంలో ప్రజాస్వామ్యం, నైతిక విలువలు సమగ్ర అభివృద్ధి పరిపాలనా దక్షత ఉండేవన్నారు. ప్రస్తుతం ప్రజాస్వామ్యం ప్రమాదపు అంచున చేరిందని చెప్పారు.
గడిచిన ఏడేళ్ల పాలనను పరిశీలిస్తే రానురాను వ్యవస్థను దారి తప్పించేలా ఉందని వాపోయారు. అప్పట్లో పాలకులు తీసుకునే నిర్ణయాలు ప్రజాసంక్షేమం, మౌలిక సదుపాయాలు, నైతికతకు అద్దం పట్టేలా ఉండేవని వ్యాఖ్యానించారు. ఇటీవల పదవులే ముఖ్యం అవుతున్నాయని, నాయకుల నీతి పక్కకు జరిగిందన్నారు. భారత ప్రజా ప్రభుత్వం ప్రమాదపుటంచులో ఉందనడంలో ఆశ్చర్యం లేదన్నారు.
జాతీయత, భాషా నియంత్రణ, ప్రాంతీయ పార్టీలపై పెత్తనం సాగించేలా పరిస్థితి ఏర్పడుతోందని వ్యాఖ్యానించారు. దేశంలో వ్యవస్థను మార్పు చేసే ప్రయత్నం జరిగిందని ఇప్పటి వరకు 130 రాజ్యాంగ సవరణలు చేశారని గుర్తు చేశారు.
దేశం ఎటు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. రాజకీయాలు నాశనం కానీ, ఒక పౌరుడిగా నేనేం చేయాలనే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. ఈ వ్యవస్థకు ఏదైనా చేయాలన్నదే తన తపన అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో జాతీయత ప్రాధాన్యత ఉండేదన్నారు. స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్కు ప్రజలు మద్దతు ఇచ్చేవారన్నారు.
ఆ తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లో పెరిగాయన్నారు. ప్రభుత్వ పాలనపై పెను ప్రభావం చూపించాయన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్థానం అత్యంత మహత్తరమైందన్నారు. సమర్థవంతంగా పని చేసే ప్రజాస్వామ్య రక్షణ సాధనం అన్నారు. తాను గతంలో ప్రతిపక్ష నేతగా పని చేశానని చెప్పారు. రాజకీయాలు వేరు, పాలన వేరు అన్నారు.