ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వ అవకాశం వస్తే.. మేమెందుకు వద్దంటాం: నాటి ప్రధాని నెహ్రూ
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం రాకుండా తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ అడ్డుపడ్డారని అంటూ బీజేపీ నాయకులు చేస్తోన్న ఆరోపణల నేపథ్యంలో.. ఓ తాజా కథనం వెలుగులోకి వచ్చింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం తమకు ఎలాంటి సమాచారం గానీ, ఆహ్వానం గానీ అందలేదని అంటూ నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1955 సెప్టెంబర్ 28వ తేదీన లోక్ సభలో ఓ ప్రకటన చేశారు. దీనికి సంబంధించిన ఓ కథనాన్ని ది హిందూ ప్రచురించింది. దీనికి సంబంధించిన ఓ క్లిప్పింగ్ ను దీనికి జోడించింది.
లోకేష్ టీం సిద్దం : వారసులకు టిక్కెట్ల వెనుక : నాడే ప్రణాళిక..నేడు అమలు: బాబు వ్యూహాత్మకం..!
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందడానికి మన దేశానికి ఆహ్వానం అందినప్పటికీ.. ఈ అవకాశాన్ని నాటి నెహ్రూ ప్రభుత్వం జార విడుచుకుందని, తనకు బదులుగా చైనాకు శాశ్వత సభ్యత్వాన్ని కల్పించేలా లోపాయకారిగా వ్యవహరించిందంటూ విమర్శలు వస్తున్నాయి. లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఇదే అంశంపై నాటి సభ్యుడు డాక్టర్ జెఎన్ పరేఖ్ అడిగిన ప్రశ్నకు నెహ్రూ బదులు ఇచ్చారు.
భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఐక్యరాజ్య సమితి తమను సంప్రదించలేదని, కనీస సమాచారాన్ని కూడా ఇవ్వలేదని నెహ్రూ సభలో వెల్లడించారు. ఉద్దేశపూరకంగానే తాము ఈ అవకాశాన్ని జారవిడుచుకున్నామని అంటూ పత్రికల్లో వచ్చిన కథనాలను నెహ్రూ తోసిపుచ్చారు.
పత్రికల్లో వచ్చిన కథనాలు నిరాధారమైనవని చెప్పారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని ఏఏ దేశాలకు ఇవ్వాలనే విషయాన్ని ఐక్యరాజ్య సమితి నిర్ధారిస్తుందని, దాని ప్రకారమే కొన్ని దేశాలకు ఆ అవకాశం దక్కిందని నెహ్రూ పేర్కొన్నారు. తమ విదేశాంగ విధానం సైతం భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కోరుకుంటోందని, అలాంటి అవకాశం వస్తే తోసిపుచ్చబోమని నెహ్రూ చెప్పారు. దీనికి సంబంధించిన 1955 నాటి క్లిప్పింగ్ ను ది హిందూ ప్రచురించింది.