మోడీ మౌనం వీడాలి, అవార్డు వెనక్కి: నెహ్రూ మేనకోడలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం తిరోగమనంలో ప్రయాణిస్తోందని ప్రముఖ రచయిత్రి, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మేనకోడలు నయనతార సెహగల్ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలుగుతోందని నిరసిస్తూ.. సాహిత్య అకాడమీ అవార్డును మంగళవారం ఆమె వెనక్కి ఇచ్చేశారు.
ఈ మేరకు 'అన్మేకింగ్ ఆఫ్ ఇండియా' పేరుతో బహిరంగ లేఖను 88 ఏళ్ల నయనతార విడుదల చేశారు. 'రిచ్ లైక్ అస్(1985)' అనే ఆంగ్ల నవలకుగాను 1986లో ఆమె సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు.
దేశంలో నెలకొన్న భయానక పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ప్రస్తుత ప్రభుత్వం నియంతృత్వ ధోరణిని అనుసరిస్తోందని ఆరోపించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదని అన్నారు. ఎంఎం కలబుర్గి, గోవింద్ పన్సారే తదితరుల హత్యలను ప్రస్తావిస్తూ... మూఢవిశ్వాసాలను ప్రశ్నించే హేతువాదులపై ప్రస్తుతం దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
అసమ్మతి, భిన్నాభిప్రాయాన్ని వెలిబుచ్చే హక్కును రాజ్యాంగం కల్పిస్తోందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ హక్కును హరించే ఘటనలు చోటుచేసుకుంటుండటంపై విచారం వ్యక్తంచేశారు. ఇటీవలి దాద్రీ ఘటనను కూడా ఆమె ప్రస్తావించారు. దేశంలో ప్రస్తుత విపరీత ఘటనలకు నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
మోడీ నాయకత్వంలో దేశం తిరోగమనదిశలో పోతోందని.. సాంస్కృతిక భిన్నత్వం దెబ్బతింటూ ఒకే ఒక్క హిందూమతం దిశగా సాగుతోందని విమర్శించారు. కలబుర్గి హత్యకు నిరసనగా... ఉదయ్ ప్రకాశ్ అనే హిందీ రచయిత సాహిత్య అకాడమీ అవార్డును... ఆరుగురు కన్నడ రచయితలు కన్నడ సాహిత్య పరిషత్కు తమ అవార్డులను వెనక్కి ఇచ్చేశారని పేర్కొన్నారు.