నాగాలాండ్ సీఎంగా రియో ప్రమాణం, తొలిసారి వెరైటీగా...!
న్యూఢిల్లీ: నాగాలాండ్లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేషనల్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) సీనియర్ నేత నెయిఫియు రియో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంతో పాటు మరో 11 మంది మంత్రులతో గవర్నర్ పీబీ ఆచార్య ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్, హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షా, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్లతో పాటు మణిపూర్, అరుణాచల్ప్రదేశ్, అసోం, మేఘాలయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీరెన్ సింగ్, పెమా ఖండూ, శర్వానంద సోనోవల్, కాన్రాడ్ సంగ్మా కూడా హాజరయ్యారు.
గత శనివారం నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఏ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని సంపాదించలేక పోయింది. దీంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో భాజపా, స్వతంత్రుల మద్దతుతో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎన్డీపీపీ ముందుకొచ్చింది.
18 మంది శాసనసభ్యులున్న ఎన్డీపీపీకి భాజపాకు చెందిన 12 మంది, జేడీయూ నుంచి ఒకరు, ఎన్పీపీ నుంచి ఇద్దరు, మరో స్వతంత్ర అభ్యర్థి మద్దతు పలికారు. మెజార్టీ ఉండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు రియోను గవర్నర్ ఆచార్య ఆహ్వానించారు. ఈ నెల 16వ తేదీలోగా రియో.. అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ తెలిపారు.
రాజ్భవన్లోని దర్బార్ హాల్లో వీవీఐపీలు, వీఐపీలు, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో మాత్రమే సీఎంల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగడం ఆనవాయితీ. అయితే ఈసారి మాత్రం రాజ్భవన్కు వెలుపల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు.
తొలిసారిగా.. ప్రజలకు కనిపించే విధంగా కోహిమాలోని ఓ స్థానిక మైదానంలో సీఎం సహా నూతన మంత్రులు ప్రమాణం చేశారు. సామాన్య ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చే విధంగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ దినపత్రికల్లో ప్రకటనలు జారీ చేసింది. ఇదే మైదానం నుంచి 1963 డిసెంబర్ 1న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నాగాలాండ్కు రాష్ట్ర హోదా ప్రకటించారు.