Citizenship Bill: సరైన అవగాహనే లేదంటూ యూఎస్ ప్యానెల్కి భారత్ కౌంటర్
న్యూఢిల్లీ: లోక్సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికాకు చెందిన యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్(యూఎస్సీఐఆర్ఎఫ్) చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. బిల్లుపై ఆ సంస్థ చేసిన వ్యాఖ్యలు ధృవీకరించదగినవి కావని భారత విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ తేల్చి చెప్పారు.
పౌరసత్వ చట్ట సవరణ బిల్లు(సీఏబీ) గానీ, జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) గానీ.. ఈ రెండింటిలో ఏదీ కూడా భారతీయుడి పౌరసత్వాన్ని తొలగించవని ఓ ప్రకటనలో తేల్చి చెప్పారు. ఈ బిల్లు కేవలం బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో హింసకు గురై భారతదేశానికి వచ్చిన శరణార్థులకు పౌరసత్వం కల్పించడం కోసమేనని రవీశ్ కుమార్ స్పష్టం చేశారు.
భారత పౌరసత్వ చట్ట సవరణ బిల్లు సోమవారం సుమారు 12 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం లోక్సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లుపై అమెరికాకు చెందిన యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్(యూఎస్సీఐఆర్ఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది.
We regret the inaccurate and unwarranted comments made by USCIRF on #CAB. They have chosen to be guided by their prejudices and biases on a matter on which they have little knowledge and no locus standi.
— Raveesh Kumar (@MEAIndia) December 10, 2019
Read our full statement below ⬇️ pic.twitter.com/BLajy03MtZ
మత ప్రాతిపదికన రూపొందించిన ఈ బిల్లును 'తప్పుడు దిశలో వెళుతున్న ప్రమాకరపు మలుపు' అంటూ వ్యాఖ్యానించింది. ఈ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా కేంద్ర ప్రభుత్వ నాయకత్వంపై ఆంక్షల్ని విధించే అంశాల్ని పరిశీలించాలని సూచించింది. ఈ క్రమంలోనే రవీశ్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ బిల్లుపై సరైన అవగాహన లేకుండా యూఎస్సీఐఆర్ఎఫ్ చేసిన వ్యాఖ్యలు అంగీకరించదగినవి కావని స్పష్టం చేశారు.