నేపాల్ దుస్సాహసం- భారత భూభాగంలోకి చొరబాట్లు- చైనా అండతో బరితెగింపు...
గల్వాన్ లోయలో చైనాతో ఉద్రిక్తతల తర్వాత ఆ దేశం అండతో మనపై ఉరుముతున్న పొరుగుదేశం నేపాల్ ఇప్పుడు ఏకంగా బరి తెగించింది. కొత్తగా లేవదీసిన ఓ వాదనను అడ్డుపెట్టుకుని చొరబాట్లకు తెగిస్తోంది. దీనిపై భారత్ అభ్యంతరాలను కూడా లెక్క చేయడం లేదు. అడిగితే అవి తమ ప్రాంతాలే అనే వాదనను కూడా తెరపైకి తెస్తోంది. దీంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ తర్వాత మరో పొరుగుదేశం నుంచి భారత్ లోకి చొరబాట్లు ప్రారంభమైనట్లే భావించాల్సిన పరిస్ధితి. అయితే దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తున్నది ఉత్కంఠగా మారింది.
Recommended Video
చర్చల వేళ.. చైనా వితండ వాదం: ఆ ప్రాంతం నుంచి ఎప్పుడో వెనక్కి వెళ్లినట్టు: అంగీకరించని ఆర్మీ
కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్..
సాటి హిందూ దేశమన్న సానుభూతితో ఇన్నాళ్లూ నేపాల్ కు సాయం చేసిన భారత్ కు అదెంత ప్రమాదకారో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. భారత్ పొరుగునే ఉంటూ ఇన్నాళ్లూ అన్ని విధాలుగా లబ్ది పొందిన నేపాల్... గల్వాన్ ఘటన తర్వాత చైనా ఒత్తిడితో భారత్ ను కొత్త వివాదాలతో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇవన్నీ చాలవన్నట్లు ఇప్పటికే భారత్ లో తమ ప్రాంతాలుగా ప్రకటించుకున్న కాలాపానీ, లిపులేఖ్ లో అక్రమ చొరబాట్లకు తెరదీసింది. కొన్ని రోజులుగా భారత్ లోని ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్ ఘర్ జిల్లాలో ఉన్న ఈ రెండు ప్రాంతాల్లోకి నేపాలీల చొరబాట్లు పెరిగినట్లు అధికారులు ప్రకటించారు.
అడిగితే దబాయింపు...
భారత్ భూభాగంలో ఉన్న కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాల్లోకి నేపాలీ పౌరుల అక్రమ వలసలపై ఆ రాష్ట్ర యంత్రాంగం నేపాల్ కు ఫిర్యాదు చేసింది. తమ భూభూగంలోకి నేపాల్ నుంచి జనం అక్రమ చొరబాట్లకు పాల్పడటం నేరమని గుర్తు చేసింది. అయితే భారత్ అభ్యంతరాలపై నేపాల్ కూడా ఘాటుగా స్పందించింది. పితోర్ ఘర్ జిల్లాలో ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లింపియాథురా ప్రాంతాలు తమవేనంటూ కౌంటర్ ఇచ్చింది. తమ ప్రాంతాల్లోకి తమ పౌరులు వస్తే చొరబాటు ఎలా అవుతుందని ఎదురు ప్రశ్నిస్తోంది. దీంతో ఉత్తరాఖండ్ అధికారులు ఆత్మరక్షణలో పడ్డారు. దీంతో ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
చైనా అండతో బరితెగింపు..
చైనాతో గల్వాన్ లోయలో జరిగిన దాడులు, ప్రతిదాడుల తర్వాత భారత్ ను ఇరుకునపెట్టేందుకు నేపాల్ పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎప్పుడో గతంలో జరిగిన ఘటనలను గుర్తు చేస్తూ భారత్ లోని మూడు ప్రాంతాలు కాలాపానీ, లిపులేఖ్, లింపియాథురా తమవేనంటూ వివాదాస్పద ప్రకటన చేసింది. అంతటితో ఆగకుండా తమ మ్యాప్ ను కూడా ఈ మేరకు మార్చేసింది. చివరికి అక్కడికి అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. ఇందంతా భారత్ ను రెచ్చగొట్టేందుకే అన్న వాదన వినిపిస్తోంది. భారత్ వీటికి తీవ్రంగా ప్రతిస్పందించి నేపాల్ పై దాడికి దిగితే చైనా రంగంలోకి దిగాలని భావిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఈ మేరకు చైనా అండ చూసుకునే నేపాల్ రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది.