భూకంపం: ఎంపీల విరాళం, ఎవరెస్ట్ షాకింగ్ వీడియోను తీసిన జర్మన్
న్యూఢిల్లీ: భూకంపం నేపథ్యంలో లోకసభ సభ్యులు తమ నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. నేపాల్లో తీవ్ర భూకంపం రాగా మూడవేల మందికి పైగా మృతి చెందారు. నేపాల్ భూకంప ప్రభావం భారత్లోని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల పైన పడింది. దీంతో, భారత్లోను 72 మంది మృతి చెందారు.
కాగా, నేపాల్ భూకంప బాధితుల కోసం శివసేన ఎంపీలందరూ నెల వేతనాన్ని ఇవ్వాలని, దానిని ప్రధానమంత్రి సహాయ నిధికి అందచేయాలని ఆదివారమే నిర్ణయించారు. దీనిపై శివసేన యువజన విభాగం యువసేన సారథి ఆదిత్య ఠాక్రే ఆదివారం ట్విట్టర్లో తెలిపారు.
ఇప్పుడు లోకసభలో ఎంపీలందరూ ఒక నెల వేతనం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. నేపాల్కు సహకరించేందుకు భారత్ ఇప్పటికే 22 టన్నుల ఆహారం, రెండు టన్నుల మెడికల్ ఐటమ్స్, 50 టన్నుల నీరును పంపించింది. వీటితో పాటు బ్లాంకెట్లు, ఇతర రిలీఫ్ మెటీరియల్స్ పెద్ద ఎత్తున పంపించింది. డిల్లీ సిక్కు కమిటీ నేపాల్కు ఆహారపొట్లాలను పంపించింది.
ఎవరెస్ట్ అతలాకుతలం
నేపాల్ భూకంపం ధాటికి ఎవరెస్ట్ కూడా అతలాకుతలమైంది. జర్మనీకి చెందిన జోస్ట్ కోబుచ్ అనే పర్వతారోహకుడు తమ శిబిరం దగ్గర భయానక దృశ్యాన్ని చిత్రీకరించారు. భూమి కంపించడం, మంచు చర్యలు విరిగిపడడంతో అ శిబిరంలో ట్రెక్కర్లు భయభ్రాంతులయ్యారు. మంచుగడ్డలు విరిగి తమ వైపుకు దూసుకు వస్తుండటంతో బేస్ క్యాంప్ వద్ద ఉన్న వారు ఆందోళనతో ఉన్నారు.
నేపాల్ భూకంప ప్రభావం ఎవరెస్ట్ పర్వతారోహకులపై కూడా పడింది. మంచు పెళ్లలు విరిగిపడి పదుల సంఖ్యలో పర్వతారోహకులు మృతి చెందారని తెలుస్తోంది. 217 మంది గల్లంతయ్యారు. పలువురు గాయపడ్డారు. ఏప్రిల్ నెలలో ఎవరెస్ట్ ఎక్కేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది.
భూకంపానికి ముందు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద వెయ్యి మంది పర్వతారోహకులు ఉన్నారు. అందులో 400 మంది విదేశీయులు బేస్ క్యాంప్కు కొంచెం ఎగువన ఉన్న క్యాంప్ 1, క్యాంప్ 2 ప్రాంతంలో వంద మంది పర్వతారోహకులు వారి సహాయకులు చిక్కుకుపోయారు.
కిందికి వచ్చే అవకాశం లేక ఎటూ కదలలేని పరిస్థితిలో ఉండిపోయారు. ఆదివారం అనేక పర్యాయాలు భూమి కంపించడంతో మంచు ముద్దలు దొర్లుకుంటూ వచ్చి పర్వతారోహకల మీద పడ్డాయి. దీంతో ఎక్కువ మరణాలు సంభవించాయి.