హిమాలయాల్లో పర్వతారోహకులు: తెలుగు యాత్రికులు సేఫ్
ఖాట్మండ్: నేపాల్ భూకంప ప్రభావం హిమాలయ పర్వతాల్లోనూ కనిపించింది. ఎవరెస్టు శిఖర ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించాయి. దీంతో పలువురు పర్వాతాకోహరకులు గల్లంతయినట్లు వార్తలు వస్తున్నాయి. బారత సైనికాధికారులు సహాయ చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నేపాల్ రాజధాని ఖాట్మండులో భారీ భూకంపం కారణంగా అక్కడి విమానాశ్రయం దెబ్బ తిన్నది. దీంతో భారత్ నుంచి వచ్చే విమానాలను రద్దు చేశారు.
నేపాల్ భూకంపం నుంచి 25 మంది తెలుగు యాత్రికులు సురక్షితంగా బయపడినట్లు సమాచారం. భూకంపం వచ్చినప్పుడు తెలుగు యాత్రికులు ఓ హోటల్లో ఉన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. భూకంపం రాగానే వారంతా నాలుగో అంతస్థు నుంచి బయటకు పరుగులు తీశారు. తెలుగు యాత్రికులు ప్రస్తుతం పశుపతినాథ్ ఆలయం వద్ద సురక్షితంగా ఉన్నట్లు మీడియా కథనాలు తెలియజేస్తున్నాయి.
భారత్ హెల్ప్లైన్
నేపాల్ భూకంప బాధితులకు అవసరమైన సహాయం అందించడానికి భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక హెల్ప్లైన్ను ఏర్పాటు చేసింది. హెల్ప్లైన్ వివరాలను భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
భారత ఎంబసీ ఖాట్మండులో అత్యవసర ఫోన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. సమాచారం కోసం 00977-9851107021, 00977-9851135141 నెంబర్లకు సంప్రదించాలని సూచించింది.
ప్రధాని హామీ
భూకంప అనంతర పరిస్థితులపై భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలతో ఫోన్లో మాట్లాడారు. నేపాల్కు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.