ఓవైపు కయ్యం... మరోవైపు విషెస్... స్వాతంత్య్ర దినోత్సవ వేళ మోదీకి నేపాల్ ప్రధాని ఫోన్...
భారత 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్ ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు. ఓవైపు సరిహద్దులో భారత్తో కయ్యానికి కాలు దువ్వుతూనే మరోవైపు ఇలా శుభాకాంక్షలు తెలియజేయడం నేపాల్ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది.
ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో వైరస్ నియంత్రణకు ఇరు దేశాలు పరస్పర సహాయ సహకారాలతో ముందుకు సాగాలని మోదీ,ఓలీ చర్చించారు. కరోనాకు సంబంధించి భారత్ తరుపున నేపాల్కు సహాయ సహకారాలు కొనసాగుతాయని మోదీ భరోసానిచ్చారు. ఇరు దేశాల మధ్య సాంస్కృతిక,పౌర సంబంధాలను కూడా మోదీ ఓలికి గుర్తుచేశారు. ఓలీ విషెస్కు ధన్యవాదాలు తెలిపారు.
భారత భూభాగంలోని లిపులేఖ్, కాలాపానీ, లింపియధుర ప్రాంతాలను నేపాల్లో తమ భూభాగంగా పేర్కొంటూ కొత్త మ్యాపులు విడుదల చేసి కొత్త వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఆ మ్యాపులను నేపాల్ పార్లమెంటులోనూ ఆమోదింపజేసుకున్నారు. త్వరలోనే ఐక్యరాజ్యసమితికి కూడా పంపించనున్నారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో నేపాల్ కూడా భారత్తో కయ్యానికి కాలు దువ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో కేపీ శర్మ ఓలీ మోదీకి ఫోన్ చేసి ఆత్మీయుడిలా విషెస్ చెప్పడం నేపాల్ ద్వంద్వ వైఖరిని బయటపెడుతోంది.