కాలాపానీ ట్విస్ట్: భారత్కు నేపాల్ షాక్.. కొత్త మ్యాప్, ప్రధాని ఓలీ సంచలనం.. ఉత్తరంలో మరో పాక్?
ఇటీవల కాలంలో చీటికి మాటికి కస్సుమంటోన్న నేపాల్.. భారత్ పట్ల మరో పాకిస్తాన్ కానుందా? వాయువ్యంలో పాకిస్తాన్, ఉత్తరంలో నేపాల్ను వశం చేసుకోవడం ద్వారా ఇండియాను మరింత ఇరుకునపెట్టేలా చైనా పావులు కదుపుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వారం రోజులుగా మలుపు తిరుగుతోన్న పరిణామాలు ఈ వాదనను మరింత బలపరుస్తున్నాయి. భారత్కు చెందిన భూభాగాన్ని తనదిగా పేర్కొంటూ నేపాల్ ప్రభుత్వం బుధవారం కొత్త జాతీయ మ్యాప్లు విడుదల చేయడం సంచలనంగా మారింది.
సీఎం జగన్ 203జీవో చీకటి కోణమిదే.. చంద్రబాబు చెప్పులు మోసింది కేసీఆరే.. రోజా రాగి సంగటితో బలుపు..
కాలాపానీ సహా ఆ మూడూ మావే..
నేపాల్ సరిహద్దులోని కాలపానీ, లింపియాధురా, లిపులేఖ్ ప్రాంతాలు బ్రిటిష్ జమానా నుంచే ఇండియాలో కొనసాగుతున్నాయి. చరిత్ర పొడవునా దీనిపై ఏనాడూ మాట్లాడని నేపాల్.. ఇటీవల చైనాకు బాగా దగ్గరైన తర్వాత మనపై కయ్యానికి కాలుదువ్వేందుకు సిద్ధమైంది. ఆ మూడు ప్రాంతాలను భారత సైన్యం బలవంతంగా ఆక్రమించుకుందని, నేపాల్ పౌరులెవరినీ అటువైపు రానీయడంలేదని, ఆ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుందామంటూ ప్రధాని కేపీ శర్మ ఓలీ మంగళవారం పార్లమెంటులో సంచలన ప్రకటన చేశారు. మరుసటిరోజైన బుధవారమే మంత్రి పద్మా ఆర్యాల్ కొత్త జాతీయ మ్యాప్ను విడుదల చేశారు. దేశానికి సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో కొత్త మ్యాపులనే వాడాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై..
ఖండించిన భారత్..
నేపాల్ ఏకపక్షంగా విడుదల చేసిన కొత్త మ్యాప్ను గుర్తించబోమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన అంశాలపై ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడబోమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ కుండబద్దలు కొట్టారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘కాలపానీ, లింపియాధురా, లిపులేఖ్ టెరిటరీల విషయంలో భారత్ స్టాండ్ ఏంటనేది నేపాల్ కు బాగా తెలుసు. అన్యాయంగా, ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం(కొత్త మ్యాప్)ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. సరిహద్దులో సమస్యలను సామరస్యపూర్వకంగా, దౌత్య చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే భారత్ అభిమతం. దీనికి నేపాల్ పాజిటివ్ గా స్పందిస్తుందని ఆశిస్తున్నాం''అని శ్రీవాస్తవ అన్నారు.
335 కి.మీ కలిపేసుకున్నారు..
నేపాల్ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన కొత్త మ్యాప్ లో భారత్ కు చెందిన కాలపానీ, లింపియాధురా, లిపులేఖ్ ఏరియాల్లోని 335 కిలోమీటర్ల ప్రాంతాన్ని తమదిగా పేర్కన్నారు. నిజానికి.. ఉత్తరాఖండ్లో నేపాల్ కు దగ్గరగా చైనా సరిహద్దులో ఇండియన్ ఆర్మీ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టిన తర్వాతే ఈ వివాదం మొదలైంది. సరిహద్దు భద్రతను పటిష్టం చేసుకోవడంలో భాగంగా ఉత్తరాఖండ్ లోని చైనా సరిహద్దు వద్ద.. 17వేల అడుగుల ఎత్తులో 80 కిలోమీటర్ల మేర వ్యూహాత్మక రహదారిని భారత్ నిర్మిస్తున్నది. దీన్ని అడ్డుకునేందుకే చైనా.. నేపాల్ ను భారత్ పైకి ఎగదోసింది.
దారులన్నీ మూసేస్తున్నారు..
భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే కైలాసమానస సరోవర యాత్రకు వెళ్లే మార్గాన్ని మూసేసిన నేపాల్.. మూడు దేశాల(భారత్-చైనా-నేపాల్) సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో ఇటీవల యాక్టివిటీలు పెంచింది. కైలాస సరోవర యాత్రకు దారి మూసేయడం వల్లే ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో కొత్త రోడ్డును నిర్మిస్తున్నామని, ఈ విషయాన్ని నేపాల్ కు కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించామని, బహుశా ‘ఇతరుల(చైనా) ఒత్తిడికి' తలొగ్గడం వల్లే నేపాల్ వింతగా ప్రవర్తిస్తుండొచ్చని భారత ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే వ్యాఖ్యానించారు. చైనా మాత్రం ఈ వ్యవహారాలతో తనకు సంబంధంలేదని, కాలాపానీ వివాదాన్ని నేపాల్-ఇండియాలే పరిష్కరించుకోవాలని చిలక పలుకులు వల్లెవేసింది.
Recommended Video
కరోనాపైనా ఓలి అక్కసు..
సరిహద్దులపై వివాదాలు సృష్టించడంతో ఆగని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి.. తమ దేశంలో కరోనా వైరస్ వ్యాప్తికి కూడా ఇండియానే కారణమని ఆక్షేపించారు. భారత్ నుంచి అక్రమంగా నేపాల్ లోకి జనాలు వస్తుండడంతో వైరస్ను కట్టడి చేయలేకపోతున్నామని, ఇండియన్లు ఉద్దేశపూర్వకంగానే వైరన్ ను వ్యాపించే కుట్రలు చేస్తున్నారా? అనే సందేహం తలెత్తుతోందని తీవ్ర ఆరోపణ చేశారు. పైగా, చైనా, ఇటలీలో వ్యాపించినదానికంటే భారత్ లో విజృంభిస్తోన్న కరోనా వైరస్ మరింత ప్రమాదకారిగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గతానికి పూర్తి భిన్నంగా నేపాల్ వ్యవహరిస్తున్న తీరు దాయాది పాకిస్తాన్ ను తలపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.