పర్యాటక శాఖ మంత్రి దుర్మరణం.. మరో ఆరుమంది కూడా
ఖాట్మాండూ: నేపాల్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం హెలికాప్టర్ కుప్పకూలిపోయిన ఘటనలో ఆ దేశ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రవీంద్ర అధికారి దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న మరో ఆరు మంది మృత్యువాత పడ్డారు. నేపాల్ ఈశాన్య ప్రాంతంలోని టప్లెగంజ్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ఎయిర్ డైనాస్టీ సంస్థకు చెందిన హెలికాప్టర్ లో ఉదయం రాజధాని ఖాట్మండూలోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి ఆయన ఈ ఉదయం టప్లెగంజ్ కు బయలుదేరారు. టప్లెగంజ్ జిల్లాలోని పతిభారా గ్రామంలో ఆయన ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఎత్తయిన హిమాలయ పర్వతాల మధ్యన ఉండే టప్లెగంజ్ గగనతలంలోకి హెలికాప్టర్ ప్రవేశించిన తరువాత రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. కొద్దిసేపటికే అది కుప్పకూలిపోయింది. మంటల్లో చిక్కుకుని పేలిపోయింది.
ఈ ఘటనలో రవీంద్ర అధికారితో పాటు ప్రముఖ ఏవియేషన్ నిపుణుడు అంగ్ సెరింగ్ షెర్పా, నేపాల్ ప్రధానమంత్రి వ్యక్తిగత సహాయకుడు యువరాజ్ దహల్, నేపాల్ పౌర విమానయాన మంత్రిత్వశాఖ డిప్యూటీ డైరెక్టర్ బీరేంద్ర ప్రసాద్ శ్రేష్ఠ, మరో పర్యాటక శాఖ అధికారి, పైలెట్ కేప్టెన్ ప్రభాకర్ కేసీ దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందిన వెంటనే ఆ దేశ విపత్తు నిర్వహణ విభాగం అధికారలు రంగంలోకి దిగారు. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి పరిస్థితిన సమీక్షిస్తున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రవీంద్ర అధికారి దుర్మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.