ఆరెస్సెస్ సమావేశానికి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అసంతృప్తి: ఇందిరాగాంధీ-నెహ్రూల మాటేమిటి?
నాగపూర్/న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జూన్ 7న నాగపూర్లో జరగనున్న రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) స్నాతకోత్సవంలో పాల్గొంటున్నారు. నిత్యం ఆరెస్సెస్ను విమర్శించే కాంగ్రెస్ పార్టీ దీనిని జీర్ణించుకోవడం లేదు. ఆరెస్సెస్ సమావేశంలో ఆయన ఏం మాట్లాడుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎదురు చూస్తోంది.
ఈ విషయంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నిరాకరించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ నో కామెంట్ అన్నారు. అయితే, కాంగ్రెస్, ఆరెస్సెస్ భావజాలాలు రెండూ వేర్వేరని చెప్పారు. మరో అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ స్పందిస్తూ... రాష్ట్రపతి పదవితో ఆయన రాజకీయాలను వదిలిపెట్టారని, ఎక్కడైనా మాట్లాడుకోవచ్చన్నారు.
ఆయన ఏం మాట్లాడారు, తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏం చేశారు? అన్నదానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మరో కాంగ్రెస్ నేత సీకే జాఫర్ ఏకంగా ప్రణబ్కే లేఖ రాశారు. ఆయన నిర్ణయం తనను షాక్కు గురి చేసిందన్నారు. జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగి, ఆయన హఠాత్తుగా ఆరెస్సెస్ వైపు చూడడం ఏమిటన్నారు. ప్రణబ్ తన బ్యాక్గ్రౌండ్ను మర్చిపోయి ప్రవర్తించడం సరికాదన్నారు. అకస్మాత్తుగా ఆయన బయటకు వెళ్తున్నారన్నారు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు.
ఆరెస్సెస్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆ సంఘం చీఫ్ మోహన్ భగవత్ పంపిన ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీతో దగ్గరి సంబంధాలున్న ఆరెస్సెస్ సమావేశానికి ఆయన హాజరు కాబోతున్నారన్న వార్త కాంగ్రెస్లో ప్రకంపనలు రేపుతోంది. దశాబ్దాలపాటు కాంగ్రెస్లో కొనసాగిన ఆయన ఆ సమావేశానికి ఎలా హాజరవుతారంటూ పార్టీ నేతలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నారు.
ప్రణబ్ హాజరు కావడంపై కాంగ్రెస్ నేతల ప్రశ్న, బీజేపీ గట్టి కౌంటర్
ప్రణబ్ ముఖర్జీ ఆరెస్సెస్ సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించుకోవడం కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే, ఆరెస్సెస్కు ప్రత్యక్షంగా ఏ పార్టీతో సంబంధం లేదని, అది ఓ జాతీయవాద సంస్థ అని, అలాంటి సమావేశాలకు వెళ్తే తప్పేమిటని అంటున్నారు.
ప్రజాస్వామ్యంలో అస్పృశ్యతకు చోటు లేదని, ఐనా ఆరెస్సెస్ ఒక భారతీయ సంస్థే గానీ పాకిస్థాన్ చెందిన ఐఎస్ఐ కాదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
ఆరెస్సెస్ సీనియర్ సభ్యుడు రతన్ శారద మాట్లాడుతూ.. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో ఆరెస్సెస్ మన సైనికులకు సాయం చేసిందని, దీనిని గుర్తించుకున్న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1963 గణంతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొనాలని సంఘ్కు ఆహ్వానం పంపారని, ఈ ఆహ్వానం మేరకు 3,000 మంది సంఘ్ కార్యకర్తలు ఈ కవాతులో పాల్గొన్నారని గుర్తు చేశారు.
అంతేకాదు, 1977లో ఆరెస్సెస్ వాస్తు శిల్పి ఏక్నాథ్ రనడే కన్యాకుమారిలో వివేకానంద స్మారకాన్ని నిర్మించారని, ఆయన ఆహ్వానం మేరకు ఇందిరా గాంధీ వచ్చారని గుర్తు చేశారు. అక్కడ నిర్వహణ తీరు చూసి ఆమె అభినందించారన్నారు. నాటి కాంగ్రెస్ నేతల తీరు కలుపుగోలుగా ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ వారసులు ఇలా ఎందుకు అలవర్చుకున్నారో అర్థం కావట్లేదన్నారు.