మ్యాగీ వివాదం: హైకోర్టును ఆశ్రయించిన నెస్లె
ముంబై: దేశవ్యాప్తంగా ఒక్క సారిగా వివాదానికి కారణమైన మ్యాగీ నూడుల్స్ వివాదం ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది. ఆహార భద్రతా నియంత్రణ మండలి సంస్థ ఇచ్చిన ఉత్తర్వులను నెస్లె ఇండియా కంపెనీ సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించింది.
మ్యాగీ న్యూడుల్స్ దేశ వ్యాప్తంగా అమ్ముడు పోయేవి. ఈ అమ్మకాలు నెస్లె కంపెనీకి మంచి లాభాలు తీసుకు వచ్చాయి. అయితే చిన్నపిల్లలకు తినిపించే మ్యాగీ నూడుల్స్ లో ఎక్కవ మోతాదులో సీసం, ఎంఎస్ జీ అనే పదార్థాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.
ఆహార భద్రతా నియంత్రణ సంస్థ మ్యాగీ నూడుల్స్ ను ప్రయోగ శాలకు పంపించి పరిక్షీంచింది. మ్యాగీ నూడుల్స్ లో సీసం, ఎంఎస్ జీ పదార్థాలు అధిక శాతం ఉందని పరిశోధనలో వెలుగు చూసింది. ఈ దెబ్బతో పలు రాష్ట్రాలలో మ్యాగీ నూడుల్స్ విక్రయాలు నిషేధించారు.
మ్యాగీ నూడుల్స్ ను మార్కెట్ లలో నుండి తాము వెనక్కి తీసుకుంటున్నామని నెస్లె కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. అయితే ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఇచ్చిన ఉత్తర్వులను నెస్లె కంపెనీ నిర్వహకులు బాంబే హై కోర్టులో సవాలు చేశారు. కోర్టు ఇచ్చే ఉత్తర్వులను బట్టి తాము ముందు ఏమి చెయ్యాలనే విషయాన్ని ఆలోచిస్తామని నెస్లె కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.