మ్యాగీ తర్వాత నెస్లేకు కొత్త కష్టాలు: పాల పొడిలో పురుగులు (వీడియో)
కోయంబత్తూరు: మ్యాగీ నూడుల్స్ వివాదంలో కొట్టుమిట్టాడుతున్న నెస్లే ఇండియా కంపెనీకి కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. నెస్లె ఇండియా కంపెనీ తయారు చేసిన పాల పొడి డబ్బాలో బ్రతికి ఉన్న పురుగులు, లార్వా బయటపడటంతో తమిళనాడులోని కోయంబత్తూరులో పాల పోడి విక్రయాలను నిషేదించారు.
కోయంబత్తూరులో కె ప్రేమ్ అనే ట్యాక్సీ డ్రైవర్ నివాసం ఉంటున్నాడు. ఇతనికి 18 నెలల కవల పిల్లలు ఉన్నారు. ఇటివల ప్రేమ్ తన పిల్లల కోసం నెస్లె కంపెనీ తయారు చేసిన నాన్ ప్రో 3 అనే పాల పొడి డబ్బా తీసుకున్నాడు. ఇంటికి తీసుకు వెళ్లి ఒక పాపకు పాలపొడితో కలిపిన పాలు తాగించారు.
అనంతరం పరిశీలించగా అందులో లార్వాతో పాటు సాధారణంగా బియ్యంలో కనిపించే పెంకి పురుగులు గుర్తించారు. పాలు పెట్టిన రెండు రోజుల తర్వాత పాప చర్మం మీద ఎలర్జీ రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రేమ్ నెస్లె కస్టమర్ సపోర్ట్ నెంబర్ కు ఫిర్యాదు చేశారు.
కంపెనీ నిర్వహకులు ఏరియా మేనేజర్ కృష్ణ పెరుమాళ్ ను పంపించారు. అతను వచ్చి వేరే పాల పొడి డబ్బా ఇస్తామని, మీ దగ్గర ఉన్న డబ్బా ఇవ్వాలని ప్రేమ్ కు చెప్పాడు. అందుకు నిరాకరించిన ప్రేమ్ తమిళనాడు ఆహారభద్రత, ఔషద నియంత్రణ విభాగం అధికారుల దగ్గరకు వెళ్లి స్యాంపిల్స్ ఇచ్చారు.
పాలపొడి డబ్బాలో 28 లార్వా, 22 పెంకి పురుగులు ఉన్నాయని, ఆ పాలపొడి సురక్షితం కాదని తమిళనాడు ఆహార భద్రత విభాగం ప్రకటించింది. కోయంబత్తూరులోని వ్యాపారులు నెస్లె పాలపొడి విక్రయాలను నిషేదించారు.