నేతాజీ విమాన ప్రమాదంలో మృతి చెందలేదు: ఫ్రెంచ్ రిపోర్ట్ షాక్
నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానం ప్రమాదంలో మృతి చెందలేదని ఫ్రాన్స్ నివేదిక వెల్లడించింది. నేతాజీ మృతి విషయంలో ఇప్పటికీ అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానం ప్రమాదంలో మృతి చెందలేదని ఫ్రాన్స్ నివేదిక వెల్లడించింది. నేతాజీ మృతి విషయంలో ఇప్పటికీ అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే.
ఆయన విమాన ప్రమాదంలో మృతి చెందారని, లేదు మారువేషంలో భారత్లోనే జీవించారని ఇలా భిన్నమైన వాదనలు వినిపిస్తుంటాయి.
తాజాగా పారిస్కు చెందిన జేబీబీ మోర్ అనే పరిశోధకుడు నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదన్నారు. ఫ్రాన్స్ గూఢచర్య సంస్థకు సంబంధించిన ఓ నివేదికను ఇందుకు ఆధారంగా ఆయన చూపించారు.
1947, డిసెంబరు 11నాటి ఆ నివేదిక బోస్ ఇండో చైనా ప్రాంతం నుంచి పారిపోయారని, అయితే ఆయన ఎక్కడ ఉన్నారన్నదానిపై సమాచారం లేదని పేర్కొందని మోర్ చెప్పారు.
నేతాజీ మృతికి సంబంధించిన ప్రస్తావనే అందులో లేదన్నారు. జపాన్ ఆక్రమణలో ఉన్న తైపీలో 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారనే బ్రిటన్, జపాన్ ప్రకటించినప్పటికీ ఈ విషయంలో ఫ్రాన్స్ మౌనం వహిస్తోంది.
పైగా 1940ల్లో ఇండో - చైనా ప్రాంతం ఫ్రాన్స్ వలస పాలనలోనే ఉంది. మరోవైపు భారత ప్రభుత్వం నేతాజీ మృతిని ధ్రువీకరించేందుకు ఇప్పటి వరకు మూడు కమిటీలు వేసింది.
వాటిలో రెండు నేతాజీ విమాన ప్రమాదంలో మరణించారని తేల్చాయి. 1999లో వేసిన ముఖర్జీ కమిషన్ మాత్రం దీనికి భిన్నమైన వాదనను వినిపించింది. నేతాజీ విమాన ప్రమాదంలో మరణించలేదని పేర్కొంది. అయితే ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది.