మమత లక్ష్యం, అసలువి కేంద్రం వద్దేనా: నేతాజీ 1964 దాకా ఉన్నారా?
కోల్కతా/న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన 12,744 పేజీలతో కూడిన 64 దస్త్రాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం బహిర్గతం చేసింది. ముందుగా వాటిని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ప్రజల సందర్శనార్థం వీటిని సోమవారం నుంచి కోలకతాలోని పోలీసు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. 12,744 పేజీలతో కూడిన 64దస్త్రాలను నేతాజీ కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని, అవి మొత్తం డిజిటైజ్ చేసి ఉన్నాయని కోల్కతా పోలీసు కమిషనర్ సురజిత్ తెలిపారు.
కీలక ఫైళ్లను విడుదల చేస్తున్న సందర్భంగా పలువురు నేతాజీ కుటుంబ సభ్యులు పోలీసు హెడ్ క్వార్టర్స్కు వచ్చారు. వీరిలో నేతాజీ మేనల్లుడు కృష్ణబోస్ భార్య కూడా ఉన్నారు. అయితే, ఫైళ్ల విడుదలకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి మమతతో పాటు అధికారులు లేరు.
1937 నుంచి 1947 మధ్య జరిగిన అంశాలు ఈ ఫైళ్లలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ ఫైళ్లు పెద్దగా ప్రాముఖ్యం లేనివని, వీటి ద్వారా అంత కీలకమైన సమాచారం పెద్దగా తెలియకపోవచ్చుననే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
కీలకమైన దస్త్రాలన్ని కేంద్రం ఆదీనంలోనే ఉన్నావని చెబుతున్నారు. విదేశాలతో జాతీయ అంతర్జాతీయ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున నేతాజీ అదృశ్యానికి సంబంధించిన దస్త్రాలను విడుదల చేయలేమని గత ఆగస్టులో పిఎంవో కేంద్ర సమాచార కమిషన్కు చెప్పింది.
దీంతో, అసలైన ఫైల్స్ కేంద్రం వద్దే ఉన్నాయనే అంశాన్ని స్పష్టం చేస్తోంది. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజకీయ లబ్ధి పొందాలనే, ప్రధాని మోడీని కౌంటర్ చేయాలనే ఉద్దేశ్యంతోనే మమతా బెనర్జీ ఇప్పుడు ఆ ఫైల్స్తో హడావుడికి తెరతీశారని భావిస్తున్నారు.
1964 దాకా బతికే ఉన్నారా?
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు చనిపోయారనే అంశంపై ఇప్పటి దాకా స్పష్టమైన సమాధానం లేదు. 1945లో తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారన్న వార్తలపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
నేతాజీపై పరిశోధనలు చేసిన పలువురు జాతీయ, అంతర్జాతీయ పరిశోధకులు కూడా ఆయన మరణంపై భిన్నమైన వాదనలు వినిపించారు. తాజాగా, అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన నివేదికలు మాత్రం నేతాజీ 1964 దాకా బతికే ఉన్నారని చెబుతున్నాయి.
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థగా ఉన్న ‘ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీసెస్ (ఓఎస్ఎస్)' నేతాజీకి సంబంధించిన ఆసక్తికర అంశాలను పేర్కొంది. 1964 ఫిబ్రవరిలో నేతాజీ భారత్కు తిరిగిరానున్నారని ఆ సంస్థ పేర్కొంది.
67 ఏళ్ల వయసులో ఉన్న నేతాజీ చైనా మీదుగా భారత్ తిరిగివస్తారని పేర్కొన్న ఆ నివేదిక, నేతాజీ రష్యా నుంచి రానున్నారన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇక 1945లో నేతాజీ చనిపోయారన్న వాదన సరికాదని పరిశోధకుడు జయంతా చౌదరి వాదిస్తున్నారు.
తన వాదనను బలపరచుకునేందుకు ఆయన నేతాజీ సోదరుడు శరత్ బోస్ 1949లో రాసిన కథనాన్ని ప్రస్తావిస్తున్నారు. నేతాజీ 1945లో చనిపోతే, 1949లో రాసిన కథనంలో శరత్ బోస్ తన సోదరుడు రెడ్ చైనాలో ఉన్నారని ఎలా రాస్తారని కూడా ఆయన వాదిస్తున్నారు. ఇదే వాదనను చౌదరి తైవాన్ విమాన ప్రమాదంపై విచారణ జరిపిన జస్టిస్ మనోజ్ ముఖర్జీ కమిషన్ ముందు వినిపించారు.
కాగా, మమతా బెనర్జీ నిర్ణయం పైన, నేతాజీ పైన రీసెర్చ్ చేసిన అనుజ్ ధర్ స్పందిస్తూ... మమత నిర్ణయం వెనుక పలు కారణాలు ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.
కాగా, కేంద్రం వద్ద ఉన్న అతి కీలకమైన డాక్యుమెంట్లను, ప్రధాని మోడీ బెంగాల్ ఎన్నికల సమయంలో బహిర్గతం చేసే ప్రణాళికలో ఉండవచ్చునని పలువురు అభిప్రాయపడుతున్నారు. దానికి కౌంటర్గా ముందే మమత బెంగాల్లో ఉన్న వాటిని బహిర్గతం చేసిందంటున్నారు. అయతే, కేంద్రం వద్ద ఉన్న కీలక డాక్యుమెంట్లు, వెస్ట్ బెంగాల్ వద్ద ఉండకపోవచ్చునని చెబుతున్నారు.