షాకింగ్: గుమ్నామిబాబా ఇంట్లో నేతాజీ ఫ్యామిలీ ఫోటోలు
లక్నో: నేతాజీ సుభాష్ చంద్రబోస్గా చాలామంది భావిస్తున్న గుమ్నామీ బాబా.. ఇంట్లోని ఓ బాక్సులో తాజాగా కొన్ని ఫోటోలు కనిపించాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాదులోని ఆయన ఇంట్లో నేతాజీ కుటుంబ సభ్యుల ఫోటోలు దొరికాయి.
వాటిలో నేతాజీ తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్, ప్రభావతి బోస్తో పాటు ఇరవై రెండుమంది నేతాజీ కుటుంబ సభ్యుల ఫొటోలు ఉన్నాయి.
గుమ్నామీ బాబా జీవితంలో 1982 నుంచి 1985 వరకు చివరి మూడేళ్లు అక్కడి రాంభవన్లో గడిపారు. దీని యజమాని శక్తి సింగ్ ప్రస్తుతం బయటపడిన ఫొటోలను ధ్రువీకరించారు. ఫోటోలతో పాటు నేతాజీ జన్మదినం, దుర్గాపూజ నాడు వచ్చిన పలు టెలిగ్రాంలు కూడా లభించాయి.
అవి ఆజాద్ హింద్ ఫౌజు దళం సీనియర్ అధికారులు గుమ్నామి బాబాకు పంపినవిగా గుర్తించారు. యూపీలోని ఫైజాబాద్ జిల్లాలో గుమ్నామీ బాబా పేరుతో నేతాజీ అజ్ఞాత జీవితం గడిపారని చాలామంది భావిస్తారు. ఆయన జపాన్లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారనే వాదన కూడా ఉంది. నేతాజీ విషయమై ఇటీవలే కేంద్రం వివరణ ఇచ్చింది. అయితే, తాజాగా ఫోటోలు లభ్యం కావడం గమనార్హం.