ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి సరైనదే: ఇజ్రాయెల్ ప్రధాని కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసే హక్కు భారత్కు ఉందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాదులను ఏరివేయడానికి, తన భూభాగాన్ని తాను కాపాడుకునే హక్కు భారత్కు ఉందని ఆయన అన్నారు.
ఆరురోజుల భారత పర్యటనలో ఉన్న నెతన్యాహూ ఉగ్రవాదుల ఏరివేత విషయమై ఇరు దేశాల మధ్య అవగాహన ఉందన్నారు. ఓ టీవీ చానెల్తో మాట్లాడుతూ.. భారత్-ఇజ్రాయెల్ భాగస్వామ్యం ఏ దేశానికీ వ్యతిరేకం కాదన్నారు.
'మేం పాకిస్థాన్కు శత్రువులం కాదు, అలాగే పాకిస్థాన్ కూడా మాకు శత్రుదేశం కాదు..' అని నెతన్యాహూ స్పష్టం చేశారు. పాలస్తీనా సమస్య గురించి ప్రస్తావించగా.. ఇతర దేశాల తరహాల్లోనే ఇజ్రాయెల్ కూడా సమస్యలను ఎదుర్కొంటోందని ఆయన బదులిచ్చారు.
'మేం పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నాం. కానీ పాలస్తీనా విషయంలో తగిన స్పందన కరువైంది. ఇజ్రాయెల్ను చాలా అరబ్ దేశాలు ఇంకెంత కాలమో శత్రువుగా చూడలేవు. ఉగ్రవాదంపై పోరు తప్పదు..'అని ఆయన వ్యాఖ్యానించారు.
భారత్, ఇజ్రాయెల్ సంబంధాలను ప్రాచీన నాగరికతలు, ప్రజాస్వామ్యాల భాగస్వామ్యంగా ఇజ్రాయెల్ ప్రధాని అభివర్ణించారు. ఇజ్రాయెల్ వ్యవసాయ విధానంతో కూరగాయల సాగులో తమ లాభాలు నాలుగైదు రెట్లు పెరిగాయని కొందరు గుజరాత్ రైతులు చెప్పారని, మిగతా రైతులందరికీ ఇలాగే లబ్ధి చేకూరితే భారతీయుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని నెతన్యాహూ పేర్కొన్నారు.