క్రిమినల్ కేసులున్నా సరే...ఎన్నికల్లో పోటీచేయొచ్చు: సుప్రీంకోర్టు
Recommended Video
ఢిల్లీ: ఎన్నికల్లో పోటీచేసేందుకు నేరస్తులకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఎన్నికల్లో పోటీచేసేందుకు నేరస్తులు అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ను విచారణ చేసిన సుప్రీంకోర్టు ... ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. కేవలం ఛార్జ్షీట్ ఆధారం చేసుకుని నేరస్తులను ఎన్నికల్లో పోటీచేయకూడదని చెప్పలేమని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా తీర్పు ఇచ్చారు. కేవలం అభియోగాలు నమోదైతే వారిపై అనర్హత వేటు వేయలేమని.. అయితే వారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చో లేదో అన్న విషయాన్ని పార్లమెంట్కే వదిలేస్తున్నట్లు స్పష్టం చేసింది.
ప్రస్తుతం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఒక క్రిమినల్ కేసులో దోషిగా తేలాకే చట్టసభ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుంది. అయితే అభియోగాల నమోదు దశ నుంచే ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో పాటు బీజేపీ నేత అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్లు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం నేడు తీర్పు వెలువరిచింది.
నేరస్తులను చట్టసభలకు దూరంగా ఉంచాలని ఇవి అన్ని జాతీయ పార్టీలు పరిగణలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించింది న్యాయస్థానం. నేర చరిత్ర ఉన్న నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్లమెంటు కఠిన చట్టం తీసుకురావాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎన్నికల సమయంలో లేదా ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదైతే వాటికి సంబంధించిన వివరాలను ఆ అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లో తప్పనిసరిగా తెలపాలంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు ఆయా పార్టీలు అభ్యర్థుల కేసుల వివరాలను వెబ్సైట్ల్ పొందుపర్చాలని ఆదేశించింది.
రాజకీయాల్లో నేరచరిత ఉండటం అభ్యర్థులు ఒక ఆస్తిగా భావిస్తున్నారని ముందు అలాంటి ఆలోచన నుంచి బయటపడాలని సుప్రీంకోర్టు కోరింది. ప్రస్తుతం దేశంలో జరిగే ఎన్నికలను డబ్బు మదబలం శాసిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. రాజకీయ అవినీతి జాతీయ ఆర్థిక ఉగ్రవాదంతో సమానం అని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఒకవేళ అభ్యర్థులు నేరం రుజువైతే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీచేయరాదని ఉంది. అయితే రాజకీయ పార్టీలను మాత్రం అధినేతలుగా వ్యవహరించొచ్చు. ఈ క్రమంలోనే నేరస్తులు అసలు పోటీచేయరాదని పేర్కొంటూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.