ఆమె ఫైర్ బ్రాండ్.. అంతకంటే మంచి అమ్మ కూడా.. మమతకు బర్త్ డే విషెస్
దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన నేత మమతా బెనర్జీ. గత కొద్ది రోజులుగా ఆమె సాధారణ పరిపాలనను చూసుకుంటూనే వివాదాస్పదన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ లు పెడుతూ సీఏఏకి వ్యతిరేకంగా ప్రజల్ని పోగేస్తున్నారు. ఆదివారం మాత్రం కాస్త రెస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే..
శుభాకాంక్షల వెల్లువ
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీకి ఆదివారంతో 65 ఏండ్లు నిండాయి. బర్త్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, నేతలు రాహుల్ గాంధీ, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తోపాటు పలువురు జాతీయ నేతలు దీదీకి విషెస్ తెలిపారు. పుట్టినరోజు కావడంతో ఇవాళ ఉద్యమానికి విరామమిచ్చిన దీదీ ఇంటిపట్టునే కుటుంబీకులతో ఉండిపోయారు.
అమ్మలా చూసుకుంటుంది..
రాజకీయాలతోపాటు సినిమాలతోనూ బిజీగా ఉన్న టీఎంసీ యువ ఎంపీ, నటి నుస్రత్ జహాన్.. దీదీకి వెరైటీగా విషెస్ చెప్పారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో నుస్రత్.. దీదీని ఉద్దేశించి చేసిన కామెంట్లు వైరలయ్యాయి. ‘‘ఆమె ఫైర్ బ్రాండ్ లీడర్.. అందరికీ ప్రేరణగా నిలుస్తారు.. వీటన్నింటికంటే మంచి అమ్మగా ఆమె నన్ను చూసుకుంటారు.. హ్యాపీ బర్త్ డే దీదీ''అని నుస్రత్ రాసుకొచ్చారు.
దీదీ వర్సెస్ మోదీ
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ.. దేశంలో కీలక నేతల పుట్టినరోజులు, ఇతరత్రా సందర్భాల్లో శుభాకాంక్షలు చెప్పడం అలవాటుగా మార్చుకున్నారు. కానీ ఆదివారం పుట్టినరోజు జరుపుకొంటున్న మమత బెనర్జీకి మాత్రం ఆయన విషెస్ చెప్పకపోవడం చర్చనీయాంశమైంది. ప్రతి దసరా పండక్కి సోదరభావంతో మోడీకి దుస్తులు, స్వీట్లు పంపేదాన్నన్న మమత.. లోక్ సభ ఎన్నికల తర్వాత మాత్రం ఆ సంప్రదాయాన్ని విరమించుకున్నారు. వెస్ట్ బెంగాల్ లో బీజేపీ 19 ఎంపీ సీట్లు గెల్చుకోవడం, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో బీజేపీపై, మోదీ, అమిత్ షాలపై మమత విమర్శల దాడిని పెంచడం తెలిసిందే.