వీళ్లు నాయకులా గూండాలా : మరో ప్రభుత్వాధికారిపై దాడి చేసిన బీజేపీ నాయకుడు
భోపాల్: అధికారం చేతిలో ఉందికదా అని నేతలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ అధికారులపై చేయిచేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే విజయ్ వర్గీయ మున్సిపల్ కార్పోరేషన్ ఆఫీసర్పై క్రికెట్ బ్యాట్తో దాడి చేసిన ఘటన మరవకముందే మరో బీజేపీ నేత ఓ ప్రభుత్వ అధికారిపై తిట్లదండకం అందుకున్నాడు. సత్నా నగర్ పంచాయత్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ దేవరత్సోనీపై బీజేపీ నేత దాడి చేసి అనంతరం దూషణలకు దిగాడు. ప్రస్తుతం దేవరత్ సోనీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
ఇక ఈ ఘటనలో దాడిచేసిన బీజేపీ నాయకుడిని గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతం నగర పంచాయతీ ఛైర్మెన్పై కూడా కేసు నమోదైంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ఆకాష్ విజయ్ వర్గీయను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.ఆయన నియోజకవర్గంలో ఓ పాడుబడిన ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చిన సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే అధికారిపై క్రికెట్ బ్యాటుతో దాడి చేశారు. ఆయన దాడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.
మున్సిపల్ అధికారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అధికారి మాటలతో ఆగ్రహానికి గురై దాడి చేసినట్లు ఆకాష్ తెలిపాడు. ఈ ఘటనలో ఆకాష్ విజయ్ వర్గీయతో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. బెయిల్ కోసం స్థానిక కోర్టును ఆశ్రయించగా కోర్టు బెయిల్ తిరస్కరించింది. రెండు వారాల పాటు జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించింది.
ఇలా నేతలు ప్రభుత్వ అధికారులపై దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని అలాగైతే తమ పనులను తాము చేసుకోలేకపోతున్నట్లు ప్రభుత్వ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పని సక్రమంగా చేసుకోవాలంటే ఇలాంటి నేతల నుంచి తమకు భద్రత కావాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే అని చెబుతున్న అధికారులు చేతిలో పదవి ఉంది కదా అని దాడులకు దిగితే నేతలకు గట్టి బుద్ది చెబుతామని హెచ్చరిస్తున్నారు.