పాక్ ప్రధానిపై మండిపడుతున్న నెటిజన్లు..! ఠాగూర్ కవితను వక్రీకరించినందుకు నిరసన..!!
ఇస్లామాబాద్/హైదరాబాద్ : ప్రపంచ క్రికెట్ కప్ లో పాకిస్తాన్ టీమ్ పేలవ ప్రదర్శన పట్ల విచారంలో ఉన్న ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో రకమైన ఇబ్బంది తరుముకొచ్చింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ఓ కవితను మరొకరికి ఆపాదించిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఓ దేశ ప్రధాని ఇంత తెలివి తక్కువగా వ్యవహరిస్తారని అనుకోలేదని విరుచుకుపడుతున్నారు. నేను నిద్రపోతున్నప్పుడు జీవితం ఆనందమయంగా ఉందని కలగంటాను.
మెలకువ వచ్చాక ఈ జీవితమంతా సేవకేనని అనిపిస్తుంది. సేవ చేస్తున్నప్పుడు చూశాను.. అందులోనే ఆనందం ఉందని అన్న రవీంద్రుడి అద్భుతమైన కవితను ఇమ్రాన్ లెబనీస్ అమెరికన్ రచయిత కాలీల్ జిబ్రాన్ రాసినట్టు పేర్కొన్నారు. దీంతో ట్విట్టర్లో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. నెట్లో కనిపించేదంతా నిజం కాదని, దానిని చెక్ చేసుకోకుండా యథాతథంగా వాడేయొద్దని హితవు పలికారు. ఇది రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్.
Recommended Video
కానీ, ఈ నయా పాకిస్థాన్ ప్రధాని మాత్రం దీన్ని జిబ్రాన్ రాశారని అనుకుంటున్నారు. పాకిస్థాన్ తన గురించి తాను జాగ్రత్తలు వహించాలి. ఎందుకంటే మీ దేశ ప్రధాని స్థిరంగాలేరు అని ఒక నెటిజన్ విమర్శించారు. ఇమ్రాన్ ఖాన్ నుంచి మరో తెలివి తక్కువ ట్వీట్ వచ్చింది అని ఒకరు సెటైర్ వేశారు.గత కొంత కాలంగా నిరుత్సాహం అనే పదాన్ని తప్ప పాకిస్థానీలు మరే పదాన్ని వినడం లేదని పాక్ చీఫ్ జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాల నుంచి చివరకు క్రికెట్ వరకు అన్నింటా దిగజారిపోతున్నామని వాపోయారు. పాకిస్థాన్ మోడల్ కోర్టులకు సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందని ఇది చాలా బాధాకరమైన విషయమని తెలిపారు.
పార్లమెంటులో అధికారపక్షం కానీ, విపక్షం కానీ వాస్తవాలు మాట్లాడే పరిస్థితి లేదని, ఇది నిరాశను కలిగించే అంశమని ఆసిఫ్ పేర్కొన్నారు. టీవీలో ఛానల్ మార్చి క్రికెట్ చూస్తే... అక్కడ కూడా అంతకంటే ఎక్కువ నిరాశే కలుగుతోందని... మన దేశ ఓటమిని చూస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ ఒక్కటే చాలా చక్కగా పని చేస్తోందని చీఫ్ జస్టిస్ సంతోషం వ్యక్తం చేశారు. మోడల్ కోర్టుల ద్వారా 48 గంటల్లో 5,800 కేసులను పరిష్కరించామని తెలిపారు.