అష్ట దిగ్బందనంలో సానియా మిర్జా..! డోస్ పెంచుతున్న నెటిజన్లు..!
హైదరాబద్ : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటోంది. సున్నితమైన భావోద్వేగాలు తారాస్థాయిలో రగులుకొని ఆమె మనుగడను ప్రశ్నిస్తున్నాయి. సోషల్ మీడియాలో కాస్త డోస్ పెంచి సానియాను దూషిస్తున్నారు నెటిజన్లు. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను వివాహం చేసుకుని అక్కడ జీవనం కొనసాగించడం నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తోంది. భారత్ తో ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ లో ఉండడమే సానియా చేస్తున్న నేరంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనే అంశం పై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సోషల్ మీడియాలో సానియా మీర్జా పై దాడి..! ఆగ్రహంతో ఊగిపోతున్న నెటిజన్లు..!!
కొన్ని ఉదంతాలు చూస్తుంటే, పెరుగుతున్న టెక్నాలజీ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తోందా? లేక పాతాళం లోకి తొక్కేస్తోందా? అనే అంశం అర్థం కాకుండా ఉంటుంది. గత పదేళ్లుగా సాంకేతికత పరంగా దేశంలో భారీ మార్పులు వచ్చేశాయి. సామాజిక మాధ్యమాలు ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తమకు తోచిన సందేశాలు పెట్టడం, ఆ తర్వాత చిక్కుల్లో పడటం కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో చూసాం. దేశంలో ఎక్కడేం జరిగినా, జనం ముందుగా ఉపయోగిస్తున్నది సామాజిక మాధ్యమమే. ఒకరకంగా ఇది ఉపయోగకరమే అయినా కొందరు మాత్రం దీనిని ఆసరాగా చేసుకొని వాళ్లిష్టమొచ్చినట్లుగా సెలెబ్రిటీలను కామెంట్స్ చేస్తుండటం పలు వివాదాలకు దారితీస్తోంది.
వింత పోకడలుపోతున్న సోషల్ మీడియా..! హద్దులు మీరుతున్న ట్రౌల్స్..!!
ఒక్కోసారి సోషల్ మీడియా వ్యవహారం పెద్ద సమస్యగా మారి దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుంటుంది. ఇటీవల కాశ్మీర్ లోని పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన దాడిని సోషల్ మీడియా వేదికగా దేశమంతా ఖండించింది. ఇంతవరకు బాగానే ఉన్నా కొందరు మాత్రం మరో అడుగు ముందుకేసి సానియా మీర్జాపై ట్రోల్స్ ప్రారంభించారు. భారత టెన్నిస్ ప్లేయర్గా ఉన్నత శిఖరాలధిరోహించిన సానియా, తన క్రీడా నైపుణ్యంతో భారత కీర్తిని ప్రపంచానికి చాటిందనటంలో అతిశయోక్తిలేదు. అయితే ఆమె వ్యక్తిగత జీవితంలో ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకోవడం అదృష్టమో లేక అతను పాకిస్తానీ కుర్రాడు కావడం దురదృష్టమో తెలీదు కానీ, పెళ్లి చేసుకుని పాకిస్తాన్ వెళ్లిపోయింది సానియా.
అనుకోని దుర్ఘటన..! పావుగా మారుతున్న సానియా మీర్జా..!!
ఐతే ఇదే సాకుగా చూపిస్తూ కాశ్మీర్లో జరిగిన దుర్ఘటనపై సానియాపై విరుచుకుపడుతున్నారు కొందరు నెటిజన్స్. నిజానికి ఆ ఘటనకి ఆమెకి ఏమాత్రం సంబంధం లేదు. కానీ సోషల్ మీడియాలో సోనియాపై పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతుండటం రోజు రోజుకు పెరిగిపోతోంది. చూసి చూసి సానియా వీటిపై తనదైన శైలిలో స్పందించింది. ముందుగా పుల్వామా దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు సంతాపం తెలిపిన సానియా, సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్పై సున్నితంగా సమాధానమిచ్చింది.
సున్నితమైన అంశం..! ఇబ్బందికర పరిస్థితుల మద్య టెన్నిస్ స్టార్..!!
సామాజిక మాధ్యమాల్లో వందల సంఖ్యలో కామెంట్లు వదిలితేనే దేశ భక్తి కాదని దేశం కోసం దేశ కీర్తిని పతాక స్థాయిలో ఎగరవేయ్యడం కోసం పని చేసినా దేశభక్తి అని పేర్కొంటూ విమర్శలను తిప్పికొట్టింది. ఆమె పెట్టిన ఈ కామెంట్లో లాజిక్ ఉంది. సోషియల్ మీడియాలో సంతాపం తెలపడమే దేశ భక్తి అని అనుకుంటే దేశం తరపున ఆడి దేశ కీర్తిని ఎన్నో సంధర్భాల్లో నిలబెట్టిన ఆమెది కూడా దేశభక్తే కదా! అదే లేకుంటే ఆమె భారత కీర్తి పతాకాన్ని దేశ విదేశాల్లో ఎందుకు చాటుతుంది..! కాబట్టి సోషల్ మీడియాలో శ్రుతి మించి వస్తున్న కామెంట్లను నియత్రించే వెసులుబాటు కూడా కల్పిస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు.