చిన్నమ్మకు నెటిజెన్స్ ఝలక్: 'శశికళ సీఎం ఏంటి? మాకొద్దు..'
శశికళ సీఎం పదవి చేపడితే.. ప్రజాస్వామ్యానికి సంతాపం ప్రకటించాల్సిందేనంటూ ఓ న్యాయ విద్యార్థి సోషల్ మీడియాలో అభిప్రాయపడటం గమనార్హం.
చెన్నై: అనూహ్య పరిణామాల నడుమ సీఎం పీఠం దిశగా కదులుతోన్న శశికళపై తమిళనాడు రాష్ట్రంలో కొంత నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో శశికళకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ నెటిజన్స్ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు చేంజ్ డాట్ ఆర్గనైజేషన్ అనే సంస్థ శశికళ సీఎం పదవి చేపట్టంపై ఆన్ లైన్ ద్వారా నెటిజెన్స్ అభిప్రాయాలను సేకరిస్తోంది. ఆదివారం నాడు ఈ ఆన్ లైన్ పిటిషన్ ప్రారంభమైంది. ఇందులో సుమారు 19వేల మంది శశికళకు వ్యతిరేకంగా అభిప్రాయాలు తెలపడం గమనార్హం.
తాము చదువుకున్న తెలివైన జయలలితకే ఓటు వేశాం తప్ప శశికళకు కాదని వారు స్పష్టం చేస్తున్నారు. మరోసారి ఎన్నికలు పెట్టయినా సరే.. తమ నాయకుడు లేదా నాయకురాలిని ఎన్నుకునే అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు.
శశికళకు వ్యతిరేకంగా తాము సేకరించిన సంతకాలను రాష్ట్రపతి, గవర్నర్ లకు అందజేస్తామని నెటిజెన్స్ తెలిపారు. కాగా, పన్నీర్ సెల్వంనే వచ్చే ఎన్నికల దాకా సీఎంగా కొనసాగించాలని కొంతమంది నెటిజెన్స్ అభిప్రాయపడ్డారు.
జయలలితకు ఓటు వేశాం గానీ.. ఆమె సహాయకురాలికి కాదంటూ వారు తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. శశికళ సీఎం పదవి చేపడితే.. ప్రజాస్వామ్యానికి సంతాపం ప్రకటించాల్సిందేనంటూ ఓ న్యాయ విద్యార్థి సోషల్ మీడియాలో అభిప్రాయపడటం గమనార్హం.