బాబూ మీకిది తగదు: చంద్రబాబు రాహుల్ కలయికపై సోషల్ మీడియాలో నెటిజెన్లు ఫైర్
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ టీడీపీలాంటి బద్ద శతృవులు కూడా ఒకతాటిపైకి చేరడం ఒక్కింత ఆసక్తిని రేపుతుంటే... తాజాగా టీడీపీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలవడం దేశం దృష్టిని ఆకర్షించింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని మీడియాతో పాటు, జాతీయ మీడియా కూడా ఈ అడుగును నిశితంగా పరిశీలిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దింపేందుకు తామంత ఒక్క తాటిపైకి వచ్చామని మరికొంతమంది జాతీయ నేతలను కలుస్తామని చంద్రబాబు, రాహుల్ గాంధీలు మీడియా సమావేశంలో చెప్పారు.
Recommended Video
రాహుల్ చంద్రబాబు కలయికపై నెటిజెన్లు ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాందీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబులు సమావేశం అవడం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది. వీరి సమావేశం తర్వాత మీడియా ముందు మాట్లాడుతున్న సమయంలో సోషల్ మీడియాలో వీరి సమావేశం గురించే నెటిజెన్లు తమదైన శైలిలో స్పందించారు. చాలామంది వీరి కలయికపై దుమ్మెత్తి పోశారు. టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు కాంగ్రెస్కు వ్యతిరేకంగా నాడు పార్టీని స్థాపిస్తే ఇప్పుడు అదే పార్టీతో చెట్టాపట్టాల్ వేసుకుని వెళ్లడాన్ని చాలామంది తెలుగుదేశం అభిమానులే జీర్ణించుకోలేకున్నారు. వారే సోషల్ మీడియాలో బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ ఆత్మఘోషిస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
నాడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నారు..తెలుగు కాంగ్రెస్ అని మార్చుకోండి: వైసీపీ
ఇక ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఆపార్టీ నేతలు చంద్రబాబు పై నిప్పులు చెరిగారు. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని నాడు చంద్రబాబు తమ పార్టీని హేళన చేశారని... ఇప్పుడు ఏ కాంగ్రెస్తో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కు అయ్యిందని ప్రశ్నిస్తున్నారు. దీనికి చంద్రబాబు లేదా లోకేష్ సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలుగు కాంగ్రెస్ అని పేరు మార్చుకుంటే బాగుంటుందని వారు సూచించారు. చంద్రబాబుకు అందితే తల లేకుంటే కాళ్లు పట్టుకోవడం అలవాటే అని వారు ధ్వజమెత్తారు. నాడు కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టిందని నిప్పులు చెరిగిన చంద్రబాబు నేడు అదే పార్టీతో చేతులు ఎలా కలుపుతున్నారని నేతలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు రాజకీయాన్ని ఏపీ ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతారని నేతలు ఫైర్ అయ్యారు. అసలు రాష్ట్రాన్ని విడగొట్టిందే కాంగ్రెస్ అయితే... అదే హస్తం పార్టీతో టీడీపీ చేతులు కలిపి ధర్మపోరాట దీక్షలు అంటూ డ్రామాలు ఆడుతోందని వైసీపీ విమర్శించింది.
చంద్రబాబుది చారిత్రక తప్పిందం..సోషల్ మీడియాలో ట్రెండింగ్
ఇక ట్విటర్, ఫేస్బుక్ వేదికగా నెటిజెన్లు దుమ్మెత్తి పోశారు. తెలుగుదేశం బండారం బయటపడిందని కామెంట్ చేశారు. ఇక తెలుగుదేశంకు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్కు పట్టిన గతే పడుతుందని కొందరు వ్యాఖ్యానించగా... చంద్రబాబు కాంగ్రెస్తో కలిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెత్తిన పాలు పోసినట్లే అని మరి కొందరు కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యల్లో కూడా నిజం దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ను అభిమానించే కొందరు తెలుగుదేశం నాయకులు అసంతృప్తితో రగలిపోతున్నట్లు సమాచారం. ట్విటర్లో చంద్రబాబుకు పిచ్చి పట్టింది అంటూ నెటిజెన్లు చేసే వ్యాఖ్యలు ట్రెండింగ్ అవుతున్నాయి. అంతేకాదు చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని త్వరలోనే ఆయన భారీ మూల్యం చెల్లించుకుంటారని నెటిజెన్లు వ్యాఖ్యానించారు.
రాహుల్ పక్కన నడిచేందుకు అత్యుత్సాహం చూపిన సీఎం రమేష్
రాహుల్ గాంధీ నివాసంలో సమావేశం ముగిశాక టీడీపీ అధినేత చంద్రబాబు, రాహుల్ గాంధీ ఇద్దరు మీడియాతో మాట్లాడేందుకు వస్తున్న సమయంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. రాహుల్ పక్కన నడిచేందుకు పోటీపడ్డారు. ఇందులో రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ అయితే ఏకంగా రాహుల్ భద్రతా సిబ్బందిని పక్కకు నెట్టివేయడం కనిపించింది. ఇరుకులోనే రాహుల్ పక్కన నడిచేందుకు సీఎం రమేష్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇక గల్లా జయదేవ్, జూపూడి ప్రభాకర్ వీరంతా కెమెరా ముందు కనిపించేందుకు ఫీట్లు చేశారు.