కేన్సా? కేదార్నాథా? సోషల్ మీడియాలో మోడీని ఆటాడుకుంటున్న నెటిజన్లు
రెండు రోజుల పర్యటనలో భాగంగా కేదార్నాథ్ వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ శనివారం కేదారేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి ఓ గుహలో ధ్యానం చేశారు. శివభక్తుడైన మోడీ కేదార్నాథ్ ఆలయాన్ని గతంలో పలుమార్లు దర్శించుకున్నారు. గతేడాది నవంబర్లో దీపావళి సందర్భంగా ఆయన కేదారేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు మోడీ 2017లో రెండుసార్లు కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించినా.. ఈసారి పర్యటన మాత్రం చర్చనీయాంశంగా మారింది.
జనం నుంచి గుహల్లోకి..! ధ్యానంలో దేశ్ కీ నేత..!!
పబ్లిసిటీ స్టంట్ విమర్శలు
ఎన్నికల సమయంలో మోడీ కేదారేశ్వరున్ని సందర్శించుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందవుల ఓటర్లను ఆకట్టుకునేందుకే ఆయన ఉత్తరాఖండ్ పర్యటనకు శ్రీకారం చుట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకే మోడీ ఈ సరికొత్త అవతారం ఎత్తారని విపక్షాలు అంటున్నాయి. పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇదంతా చేస్తున్నాయని మండిపడుతున్నాయి.
మోడీ తీరుపై కాంగ్రెస్ ఫైర్
ఇదిలా ఉంటే కేదార్నాథ్లో మోడీకి రెడ్ కార్పెట్ స్వాగతం పలకడంపై కాంగ్రెస్ అగ్గిమీద గుగ్గిలమవుతోంది. దైవ సన్నిధిలో మోడీ వ్యవహరించిన తీరును తప్పుబడుతోంది. 'నిజమైన భక్తులు దైవ సన్నిధిలోకి వెళ్లే ముందు తమలోని అహాన్ని, అహంకారాన్ని త్యాగం చేస్తారు. అంతేతప్ప రెడ్ కార్పెట్లపై నడవరు. మోడీగారు మీకు ఆ విషయం తెలుసనుకుంటాన'ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా ట్వీట్ చేశారు.
ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ప్రధాని కేదార్నాథ్ పర్యటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మోడీ వేషధారణ, రెడ్ కార్పెట్ స్వాగతంపై నెటిజన్లు కేన్స్ 2019 హ్యాష్ ట్యాగ్ పేరుతో ట్రోల్ చేస్తున్నారు. మోడీ కేన్స్లో ఉన్నారా లేక కేదార్నాథ్కు వెళ్లారా అని ప్రశ్నిస్తున్నారు. మోడీ ధరించిన దుస్తులు తన ఫేవరెట్ డ్రెస్ అని ఒకరంటే.. ఆయన భుజంపై వేసుకున్న సిల్కు శాలువాకు మట్టి అంటకుండా రెడ్ కార్పెట్ అవసరమే అంటూ మరొకరు సటైర్ వేశారు. మోడీ కేదార్నాథ్ ఆలయం బయట ఫొటోలకు ఫోజిలివ్వడంపై స్పందించిన మరికొందరు.. 'మోడీ తన ఇష్టదైవం కెమెరాను ప్రార్థిస్తున్నార'ని ఫన్నీ కామెంట్ చేశారు.