nirbhaya case: తాను క్షమాభిక్ష కోరలేదంటూ దోషి వినయ్ శర్మ!
న్యూఢిల్లీ: 2012లో దేశ రాజధానిలో చోటు చేసుకున్న నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన వినయ్ శర్మ తాను క్షమాభిక్ష కోరలేదని చెబుతున్నాడు. ఈ విషయమై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు తాజాగా అతడు ఓ దరఖాస్తు చేసుకున్నాడు.
తన పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్ను తక్షణమే వెనక్కి పంపాలని తెలిపాడు. హోంశాఖ పంపిన పిటిషన్ను తాను దాఖలు చేయలేదని, దానిపై తాను సంతకం కూడా చేయలేదని వినయ్ శర్మ ఆ లేఖలో పేర్కొన్నాడు.
వినయ్ శర్మ పేరుతో వచ్చిన క్షమాభిక్ష పిటిషన్ను ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ పిటిషన్ కేంద్ర హోంశాఖకు చేరింది. శుక్రవారం వినయ్ శర్మ పిటిషన్ను రాష్ట్రపతికి పంపిన కేంద్ర హోంశాఖ.. అతడి క్షమాభిక్షను తిరస్కరించాలని సూచించింది.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఇలాంటి దారుణమైన కేసుల్లో నిందితులకు క్షమాభిక్ష పెట్టడం కుదరని శుక్రవారం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసలు తాను క్షమాభిక్ష కోసం ఎలాంటి దరఖాస్తు చేయలేదని వినయ్ శర్మ చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది. అసలు ఆ క్షమాభిక్ష పిటిషన్ ఎవరూ దాఖలు చేశారన్నది తెలియాల్సి ఉంది.
2012, డిసెంబర్లో దేశ రాజధానిలో 23ఏళ్ల ప్యారామెడిక్ విద్యార్థి(నిర్భయ)నిపై సామూహిక అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ కేసులో ఆరుగురిని దోషులుగా గుర్తించారు. వారిలో రామ్ సింగ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మిగితా ఐదుగురిలో ఒకరు మైనర్ కావడంతో.. మూడేళ్ల తర్వాత అతను విడుదలయ్యాడు. మిగితా నలుగురు దోషుల్ని జైళ్లలో ఉంచారు. ఇప్పటికీ వారికి శిక్ష అమలుకాకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
అత్యంత దారుణానికి పాల్పడిన ఐదుగురు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తనను ఉరిశిక్ష నుంచి తప్పించి క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్కు విన్నవించుకున్నాడు. ఢిల్లీ ప్రభుత్వంతోపాటు హోంమంత్రిత్వశాఖ అభిప్రాయాన్ని తీసుకుని రాష్ట్రపతి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ ప్రభుత్వం వినయ్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్షను ఇప్పటికే తిరస్కరించగా.. తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా తిరస్కరించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఇలాంటి దారుణ ఘటనల్లో దోషులకు క్షమాభిక్ష పెట్టడం కుదరదని స్పష్టం చేశారు.