తీవ్ర వ్యతిరేకత! ఒకే భాషపై వెనక్కి తగ్గిన అమిత్ షా: ఏమన్నారంటే..?
న్యూఢిల్లీ: హిందీ భాషను దేశ వ్యాప్తంగా అమలు చేయాలన్న వ్యాఖ్యలపై భారీ ఎత్తున నిరసనలు రావడంతో కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కొంత వెనక్కి తగ్గారు. తాను ప్రాంతీయ భాషలను కాదని, హిందీ భాషను అమలు చేయాలని ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు.
అయితే, తన వ్యాఖ్యలపై కొంతమంది రాజకీయాలు చేయాలనుకుంటున్నారని, అది వారి ఇష్టానికే వదిలేస్తున్నానని అన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పౌరులు మొదట వారి మాతృ భాషను నేర్చుకున్న తర్వాత.. రెండో భాషగా హిందీని నేర్చుకోవాలని తాను సూచించానని స్పష్టం చేశారు.
తాను కూడా హిందీయేతర మాతృ భాష గల రాష్ట్రం గుజరాత్ నుంచి వచ్చానని అమిత్ షా గుర్తు చేశారు. ఇటీవల ఒకే దేశం ఒకే భాష అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. దేశంలో ఎన్నో ప్రాంతీయ భాషలున్నప్పటికీ భారత్ను ఏకం చేయగల సత్తా హిందీకే ఉందని అన్నారు.
ఈ క్రమంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. తమిళనాడు, కేరళ రాజకీయ నాయకులు హిందీకి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే చేస్తామంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రులు, సినీనటులు కూడా వారికి మద్దతుగా నిలిచారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా అమిత్ షా వ్యాఖ్యలను వ్యతిరేకించారు. ప్రాంతీయ భాషలను కాదని ఒకే భాషను అమలు చేయడం సాధ్యం కాదన్నారు.