‘కరోనా ఎక్స్ప్రెస్’ అని నేనలేదు: అమిత్ షా విమర్శలపై మమతా బెనర్జీ
కోల్కతా: బీజేపీ నేత, హోంమంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలకు పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. తాను ఎప్పుడూ శ్రామిక్ ప్రత్యేక రైళ్లను కరోనా ఎక్స్ప్రెస్లు అని పిలువలేదని మమత వ్యాఖ్యానించారు. దేశంలో పలు చోట్ల చిక్కుకుపోయిన వలస కూలీలను తమ సొంత రాష్ట్రాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శ్రామిక రైళ్లను మమతా బెనర్జీ కరోనా ఎక్స్ప్రెస్లంటూ అవమానించారంటూ అమిత్ షా ఆరోపించారు.
అంతేగాక, వచ్చే ఎన్నికల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని అమిత్ షా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అమిత్ షా ఆరోపణలను మమతా కొట్టిపారేశారు. 11 లక్షల మంది వలస కూలీలు బెంగాల్కు వచ్చారని ఆమె తెలిపారు.
సామాన్య ప్రజలు 'కరోనా ఎక్స్ప్రెస్'లు అనుకుంటున్నారని మాత్రమే అన్నానని చెప్పుకొచ్చారు మమత. కావాలంటే తాను అప్పుడు ఏమన్నానో చూసుకోవచ్చని అన్నారు.
ఇది ఇలావుండగా, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు మమతా బెనర్జీ సర్కారు షిప్టుల పనివిధానం ప్రవేశపెట్టింది. పని ప్రదేశాల్లో రద్దీని నివారించేందుకు ఈ మేరకు నిర్ణయించినట్లు సీఎం మమతా తెలిపారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు ప్రజలు అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని సూచించారు. కరోనా కష్టకాలంలో ప్రైవేటు పాఠశాలలు ఫీజులు పెంచవద్దని కోరారు. జూన్ 30 వరకు కూడా రాష్ట్రంలో పాఠశాలలు తెరచుకోవన్నారు.
కాగా, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 9328 కరోనా కేసులు నమోదయ్యాయి. 5117 యాక్టివ్ కేసులుండగా, 3779 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 432 కరోనా మరణాలు సంభవించాయి.