రైతుల ఆందోళనలపైను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు: అమిత్ షా
న్యూఢిల్లీ/హైదరాబాద్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు రాజకీయ ప్రేరేపిత నిరసనలుగా తానెప్పుడూ పేర్కొనలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా అలా అనని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో పర్యటించిన అమిత్ షా ఈ మేరకు స్పందించారు.
'ఢిల్లీ చలో' పేరుతో పంజాబ్ రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఈ నేపథ్యంలో హర్యానా సీఎం, బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ఆందోళనలపై తీవ్రంగా స్పందించారు. రైతుల ఆందోళనల వెనుక రాజకీయ పార్టీల హస్తం ఉందని, వారి మద్దతుతోనే రైతులు చలో ఢిల్లీకి పిలుపునిచ్చారని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అంతకుముందే నిరసన తెలుపుతున్న పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రైతులను బుజ్జగించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రైతులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు, ఆందోలనలను ముందుకు సాగించారు.
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్రాల్లోని 30 రైతు సంఘాలు ప్రస్తుత ఆందోళన కార్యక్రమాల్లో భాగస్వాములమయ్యయి. సమస్యలను పరిస్కరించాలని డిమాండ్ చేశారు. షరతులతో కూడిన చర్చలను తాము అంగీకరించమని రైతు సంఘాలు తేల్చి చెబుతున్నాయి. నేరుగా రైతులతోనే చర్చలు జరపాలని డిమాండ్ చేశాయి. కాగా, డిసెంబర్ 1 నుంచి రాష్ట్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పలు రైతు సంఘాలు పిలుపున్చాయి.