ఇంత అద్బుత ఆతిథ్యం ఎక్కడా చూడలేదు: ఫొటోలు, వీడియోలతో డొనాల్డ్ ట్రంప్ సీనియర్ అధికారి
అహ్మదాబాద్: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం లభించిన విషయం తెలిసిందే. అయితే, ఇంత అద్భుతరీతిలో తమకు స్వాగతం లభించడం ఇదే తొలిసారని ట్రంప్ సీనియర్ సహాయక అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.
Recommended Video
Namaste Trump: చిరకాల బంధమంటూ ప్రధాని మోడీ ప్రసంగం, మెలానియా ట్రంప్పై ప్రశంసలు
గొప్ప స్వాగతం..
తమకు ఇంత అద్భుత స్వాగతం ఎక్కడా లభించలేదని, ఇలాంటి అపూర్వ స్వాగతాన్ని తాము ఎప్పుడూ అందుకోలేదని డొనాల్డ్ ట్రంప్ సీనియర్ అసిస్టెంట్ డాన్ స్కావినో జూనియర్ వ్యాఖ్యానించారు. మోతెరా స్టేడియం మార్గంలో తమకు ఇక్కడి ప్రజల నుంచి గొప్ప స్వాగతం లభించిందని అన్నారు. ప్రజలంతా ఫొటోలు, వీడియోలు తీసుకోవడం గమనించానని తెలిపారు.
విమానాశ్రాయం నుంచే..
సోమవారం భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మదాబాద్కు చేరుకున్నారు. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ ఆయన సతీమణి మెలానియా ట్రంప్ సోమవారం ఉదయం 11.37కు సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. 11.40కి షెడ్యూల్ ఉన్నప్పటికీ ముందుగానే చేరుకున్నారు.
మోతెరా స్టేడియం వెళ్తుండగా..
అప్పటికే అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. విమానాశ్రయంలో అమెరికా అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఈ నేతలు మహాత్మాగాంధీ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ తర్వాత అక్కడ్నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మోతెరా స్టేడియానికి చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అమెరికా, భారత్ దేశాధినేతలు ప్రసంగించారు. ఇరు దేశాల బంధం చిరకాలం కొనసాగాలని నేతలు ఆకాంక్షించారు.
ఇలా ఎప్పుడూ చూడలేదు..
కాగా, ట్రంప్ దంపతులతోపాటు వారి కూతురు ఇవాంకా, అల్లుడు జరెడ్ కుష్నర్, ఉన్నతాధికారులు భారత పర్యటనకు వచ్చారు. వీరందరికి గుజరాతీతోపాటు భారత సాంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం లభించింది. హూస్టన్లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమం తర్వాత ఈ దేశాధినేతలిద్దరూ ఒకే వేదికపై కలవడం ఇదే కావడం గమనార్హం.
మోతెరా మోగిపోయింది..
విమానాశ్రయం నుంచి మోడీ, ట్రంప్ వెళుతుండగా వారికి ఘన స్వాగతం పలికారు జనం. దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి మోతెరా స్టేడియం చేరుకున్నారు ఈ నేతలు. పలు ప్రాంతాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళకారులు నృత్య ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. రహదారి పొడవునా ఈ నేతలకు ప్రజలు చేతులు ఊపుతూ, ఇరుద దేశాల జెండాలతో స్వాగతం పలికారు. ఇక మోతెరా స్టేడియంలో లక్షా 20 వేల మంది ప్రజలు మోడీ, ట్రంప్కు ఘన స్వాగతం పలికారు. నేతల రాకతో మోడీ నినాదాలతో స్టేడియం హోరెత్తింది.